
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మొత్తం మూడు విడతల్లో పోలింగ్ జరగగా మూడింటిలోను టీఆర్ఎస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది. మూడు విడతల్లో మొత్తం 12,761 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో 4,470 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 769 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి.
ఇక రెండో విడతలో 4,135 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా 788 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3,342 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో 4,116 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా 577 గ్రామాలు ఏకగ్రీవమై.. 3,506 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లోనూ కలిపి దాదాపు 6 వేల పైచిలుకు గ్రామాల్లో టీఆర్ఎస్ మద్దతు దారులు విజయం సాధించారు.