గాంధీ భవన్ చెరిసగం | Gandhi bhavan separates half for two regions | Sakshi
Sakshi News home page

గాంధీ భవన్ చెరిసగం

Mar 16 2014 2:09 AM | Updated on Jul 12 2019 3:10 PM

గాంధీ భవన్ చెరిసగం - Sakshi

గాంధీ భవన్ చెరిసగం

గాంధీభవన్‌లో ఉన్న సదుపాయాలను ఇరు ప్రాంతాల కాంగ్రెస్ కమిటీలు వాడుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారు.

సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో ఉన్న సదుపాయాలను ఇరు ప్రాంతాల కాంగ్రెస్ కమిటీలు వాడుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారు. కొత్తగా నిర్మించిన ఇందిరాభవన్‌లో సదుపాయాలు కల్పించే వరకు రెండు పీసీసీలకు ఇది తప్పదన్నారు. కంప్యూటర్ వ్యవస్థ, సమావేశపు మందిరం, మీడియా సమావేశపు హాలు ఇలా అన్నీ వంతుల వారీగా వాడుకోవాలన్నారు.
 
 శనివారం ఏపీసీసీ, టీపీసీసీ నూతన అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలకు ఆయన బాధ్యతలు అప్పగించారు. పొన్నాలతోపాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికూడా బాధ్యతల స్వీకార పత్రంపై సంతకం చేశారు.


 ఇందిరా భవన్‌ను ప్రారంభించిన దిగ్విజయ్
 అంతకు ముందు కొత్తగా నిర్మించిన ఇందిరా భవన్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ... పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి సీనియర్ నేతలని, వారి నాయకత్వంలో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందర్నీ కలుపుకొని వెళ్లాలని వారికి సూచించారు.
 
 కాంగ్రెస్‌లో పలువురి చేరిక
 ఇదిలా ఉండగా శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల సమక్షంలో తె లంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ రియాజ్ (నాలుగు జిల్లాల హెచ్‌ఎంఎస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు), మాజీ జెడ్పీటీసీ బాలమణెమ్మ తదితరులు ఉన్నారు.
 
 బ్రాహ్మణులకు అవకాశమివ్వాలని దిగ్విజయ్‌కు వినతి
 వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం కల్పించాలని బ్రాహ్మణ సంఘం సభ్యులు కోరారు. శనివారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement