చట్టప్రకారం పరిహారం ఇస్తాం | Formers Gave Letter To Collector On Issues | Sakshi
Sakshi News home page

చట్టప్రకారం పరిహారం ఇస్తాం

Mar 23 2018 4:01 PM | Updated on Mar 23 2018 4:01 PM

Formers Gave Letter To Collector On Issues - Sakshi

కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు, రైతులు

సాక్షి, చేవెళ్ల : హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా  భూములు కోల్పో తున్న రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం మెరుగైన పరిహారం అందజేసేలా కృషి చేస్తున్నామని కలెక్టర్‌ రఘునందన్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మండల కేంద్రం లోని అర్డీఓ కార్యాలయంలో చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భూరికార్డుల ప్రక్షాళనపై చర్చించారు. ప్రభుత్వం అందజేయనున్న ‘పంట పెట్టుబడి’కి భూరికార్డులు పక్కగా ఉండాలని తెలిపారు. పెండింగ్‌ పనులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదేశించారు. అయితే, చేవెళ్లకు కలెక్టర్‌ వచ్చిన విషయం తెలుసుకున్న నేషనల్‌ హైవే, బైపాస్‌ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు వచ్చి ఆయనను కలిశారు. చేవెళ్ల ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉన్నాయని, ప్రభుత్వ ధరల ప్రకారం చెల్లిస్తే రైతులకు నష్టం జరుగుతుందని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బహిరంగ మార్కెట్‌ విలువ రూ. 50 లక్షల నుంచి కోటి.. అంతకంటే ఎక్కువే ఉందని చెప్పారు. ప్రభుత్వ ధర మాత్రం కేవలం రూ. 5 లక్షలే ఉండడంతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రాంతం మొత్తం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉందని, ఈనేపథ్యంలో పరిహారం పెంచాలని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటస్వామి, మండల పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు కలెక్టర్‌ రఘునందన్‌రావును కోరారు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ.. భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే రైతులకు పరిహారం ఇస్తామని చెప్పారు.

అయితే, ఇందులో అధికారులు చేసేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. అవకాశం ఉన్న మేరకు రైతులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ధరకు మరో రెండు రెట్లు అధిక ధర చెల్లిస్తామని, దీనికి రైతులు సహకరించాలని కోరారు. రైతుల బాధలను గుర్తించి తగిన సహాయం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందిం చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతులు మర్పల్లి కృష్ణారెడ్డి,  అగిరెడ్డి, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాగిరెడ్డి, వెంకట్‌రెడ్డి,  విజయభాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీ రాంరెడ్డి, బాలయ్య, ప్రభాకర్, రాములు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement