‘మాఫీ’ కోసం తిరుగుతూ.. మృత్యుఒడిలోకి.. | died for 'Waiver' wandering | Sakshi
Sakshi News home page

‘మాఫీ’ కోసం తిరుగుతూ.. మృత్యుఒడిలోకి..

Oct 18 2014 12:28 AM | Updated on Sep 2 2017 3:00 PM

రుణమాఫీ కోసం కార్యాలయాల చుట్టూ నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ రైతు మృతి చెందాడు.

మెదక్ జిల్లాలో ఘటన
 
 వెల్దుర్తి: రుణమాఫీ కోసం కార్యాలయాల చుట్టూ నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ ఆరెగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుష్కి రాములు(65) తనకున్న ఎకరంన్నర భూమి లో నీటి సౌకర్యం లేక హల్దీవాగు పరిసరాల్లో ఓ వ్యక్తికి చెందిన రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. తన పొలంపై బ్యాంకులో రూ.65 వేలు రుణం పొందాడు. రుణమాఫీపై గురించి తెలుసుకునేందుకు నాలుగు రోజుల క్రితం బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అధికారులు రుణమాఫీ చేయాలంటే పహాణి సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పడంతో ఈసేవ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ సర ్వర్లు డౌన్ అయ్యాయని నిర్వాహకులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. ఇదిలా ఉండగా.. అధికారులు ఆహార భద్రతా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో బిజీగా ఉండిపోయారు. 

రెండురోజులుగా తిండీ తిప్పలు లేకుండా అధికారుల  చుట్టూ తిరిగాడు. అందులో భాగంగానే గురువారం కూడా రెవెన్యూ కార్యాలయానికి వచ్చి సాయంత్రం ఏడు గంటల సమయంలో గ్రామానికి కాలినడకన బయలుదేరాడు. అయితే ఎలుకపల్లి రోడ్డు వద్దకు రాగానే సొమ్మసిల్లి కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నీరసించి చనిపోయాడని మృతుడి భార్య యశోద విలపించారు. కొత్త రుణాలకు మాత్రమే పహాణీలు అడిగామని, రుణమాఫీకి ఎలాంటి పత్రాలు అడగలేద సెంట్రల్ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్‌రావు అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement