మత ఘర్షణలు సృష్టిస్తున్న బీజేపీ

మద్దూరు(హుస్నాబాద్‌): బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్‌ చేతిలో కీలు బొమ్మగా మారి దేశంలో మత ఘర్షణలు సృష్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి. వెంకట్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో సీపీఎం 4వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బోయిని సిద్దిరాములు అమరవీరుల స్థూపం వద్ద పార్టి జెండాను ఆవిష్కరించి, అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తోంటే బీజేపి ప్రభుత్వం సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడుతోందని అన్నారు. సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.

 జీఎస్‌టీ పేరుతో పేద ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ విధానాలనే అవలంబిస్తూ రైతులను మోసం చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడెరాల భూపంపిణీ, రైతుల రుణ మాఫీల్లో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, దాసరి కళావతి, ఆలేటి యాదగిరి, సుంచు విజేందర్, ఎండీ షఫీ, సావిత్రి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top