
రేపు ఢిల్లీలో ‘ఢీ’సీసీ!
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎంపిక వ్యవహారం 15వ తేదీన ఢిల్లీకి చేరనుంది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎంపిక వ్యవహారం 15వ తేదీన ఢిల్లీకి చేరనుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక, పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఆ పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీ బాట పట్టారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి జట్టి కుసుమకుమార్ తదితరులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సమావేశం అవుతారు.
జిల్లా కాంగ్రెస్లో బద్ధశత్రువులుగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి, రేణుక వర్గీయులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పార్టీకి తాము చేసిన సేవలు, ప్రత్యర్థివర్గం తప్పిదాలను ఏకరువు పెట్టి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున్ని మారుస్తారన్న ప్రచారం సుదీర్ఘకాలంగా జరుగుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ ఆశించి మిత్రపక్షాల పొత్తుల వల్ల టికెట్ దక్కించుకోలేకపోయిన మాజీ మంత్రి, అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు ైవె ఎస్ఆర్సీపీలో చేరారు. జిల్లా పార్టీకి అధ్యక్షుడు లేకుండానే ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. తదనంతర పరిణామాల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవటం అవశ్యం అయింది. కమిటీ ఎంపికలో ఏకాభిప్రాయ సాధన కోసం పలుమార్లు ప్రయత్నాలు జరిగాయి. వర్గపోరు కారణంగా అవన్నీ విఫలమయ్యాయి. 15న ఢిల్లీలో జరిగే సమావేశంలోనూ ఇదే తంతు కొనసాగుతుందనే భావన కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.
ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ రేణుకాచౌదరి, ఒక ఎమ్మెల్సీ ఎవరికి వారు తమకు అనుకూలమైన నేతల పేర్లను డీసీసీ అధ్యక్ష స్థానానికి సూచిస్తున్నారు. సామాజిక సమీకరణలు, ఆయా నేతలు అందించిన సేవల ఆధారంగా ఇరువర్గాలు తమ జాబితా సిద్ధం చేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ఉంటున్న రాంరెడ్డి వెంకటరెడ్డి డీసీసీ పీఠంపైనా కన్నేశారు. లేదంటే తన వర్గీయుడు, బీసీ నేత శీలంశెట్టి వీరభద్రానికైనా ఆ పదవి ఇవ్వాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవంగా తనపేరును ఆమోదిస్తే తప్ప ఆ పదవిని తీసుకునేందుకు రాంరెడ్డి ఆసక్తిగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. తన అవకాశాలకు గంటికొట్టాలని ప్రయత్నించేవారికి చెక్పెట్టాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా శీలంశెట్టి పేరును తెరమీదకు తెస్తున్నట్లూ తెలుస్తోంది.
రేణుకాచౌదరి తన వర్గీయులైన పరచూరి మురళీకృష్ణ, రావూరి వెంకటరామయ్య, వీవీ అప్పారావుల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆశీస్సులతో పార్టీ సీనియర్ నేత ఐతం సత్యం అధ్యక్ష స్థానానికి గురిపెట్టినట్లు సమాచారం. పనిలో పనిగా ఆయన రేణుక ఆశీస్సుల కోసం ప్రయత్నించి...భంగపడినట్లు సమాచారం. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మాత్రం రాంరెడ్డి వెంకటరెడ్డికే మద్దతు ఇస్తున్నారని సమాచారం.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల్లో ఏ ఒక్కచోట బీసీలకు టికెట్ ఇవ్వకపోవడం కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. బీసీల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీ నేతకు అధ్యక్ష పీఠం అప్పగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
తమవ ర్గానిది పైచేయి కాకపోయినా ప్రత్యర్థులది పై‘చేయి’ కావద్దనే సూత్రంతో కాంగ్రెస్ వ ర్గాలు పావులు కదుపుతున్నాయని సమాచారం. ఇంతటి విభేదాలతో ఉన్న జిల్లా కాంగ్రెస్లో ఐక్యతారాగం తేవడంలో దిగ్విజయ్ ఏమేరకు సక్సెస్ అవుతారనేది ఆసక్తి కలిగిస్తోంది. ఎప్పటిలాగే సమస్యను తేల్చకుండా నాన్చుతారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి వ్యవహారం హస్తినలోనూ తేలకపోతే సమన్వయకమిటీ కన్వీనర్ను నియమించి ఆయనతోనే కొద్దికాలం నెట్టుకొద్దామనే ఆలోచనలోనూ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా హస్తిన- హైదరాబాద్ల్లో దోబూచులాడుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎంపిక వ్యవహారం ఈసారైనా కొలిక్కి వస్తుందా? అనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.