ఆర్యవైశ్యులను సీఎం ఆదుకుంటారు  | CM will help the aryavysyas | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులను సీఎం ఆదుకుంటారు 

Nov 6 2017 2:35 AM | Updated on Aug 20 2018 5:04 PM

CM will help the aryavysyas - Sakshi

సదస్సులో అభివాదం చేస్తున్న మహాసభ ప్రతినిధులు

శంషాబాద్‌(రాజేంద్రనగర్‌): ఆర్యవైశ్యుల డిమాండ్లను తీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని నిజామాబాద్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం శంషాబాద్‌లో దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సు జరిగింది. వైశ్యులపై ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం ఉందని సదస్సులో ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే ఆర్యవైశ్యులను ముఖ్యమంత్రి కలుసుకుని డిమాండ్లను నెరవేరుస్తారన్నారు. ఆర్యవైశ్యులకు సంబంధించిన పలు డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు.

సమాచార హక్కు కమిషన్‌ బుద్ధా మురళిని మహాసభ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.దామోదర్‌ గుప్తా అన్నారు. ఆర్యవైశ్యులకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ప్రముఖ ఆలయాల వద్ద ఆర్యవైశ్య మహాసభలకు ఐదెకరాల చొప్పున స్థలాలను కేటాయించడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం, కల్యాణలక్ష్మి వంటి పథకాలను నిరుపేద ఆర్యవైశ్యులకు కల్పించాలంటు ఐదు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల బోర్డు చైర్మన్‌ సంపత్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌.గణేశ్‌గుప్తా, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొండె మల్లికార్జున్, సుమారు ఐదు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement