అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ నర్సక్కపేటలో గురువారం రాత్రి రైతులు తెలంగాణ సంబరాలను అడ్డుకున్నారు.
ఇల్లంతకుంట, న్యూస్లైన్ : అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ నర్సక్కపేటలో గురువారం రాత్రి రైతులు తెలంగాణ సంబరాలను అడ్డుకున్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, ఎన్ని వేల కోట్ల పంట రుణాలున్నా... మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించిన టీఆర్ఎస్ ఇప్పుడు వెనకడుగు ఎందుకు వేస్తోందని ప్రశ్నించారు. అన్ని రుణాలను మాఫీ చేస్తామని చెప్పి... తీరా గద్దెనెక్కాక 2013 జూన్ నుంచి 2014 మే 30 వరకు తీసుకున్న పంట రుణాలనే మాఫీ చేస్తానని ప్రకటించడం సరికాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నర్సక్కపేటలో గురువారం రాత్రి మహిళలు బతుకమ్మలతో తెలంగాణ సంబరాలు నిర్వహించేందుకు వస్తుండగా గ్రామానికి చెందిన 2 వందల మంది రైతులు అడ్డుకున్నారు. రైతుల పంట రుణాలను మాఫీ చేస్తేనే తెలంగాణ సంబరాలు నిర్వహించాలని, రైతులను పట్టించుకోకుంటే ఇక సంబరాలెందుకని అనడంతో మహిళలు వెన క్కి వెళ్లిపోయారు. 2009 నుంచి 2014 వరకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, లేని పక్షంలో తెలంగాణ సంబరాలు జరగనివ్వబోమని, ఎమ్మెల్యే గ్రామానికి వచ్చినా కూడా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. ఆదోళనలలో 2 వందల మంది రైతులు పాల్గొన్నారు.