
50 తండాలకు పంచాయతీ హోదా
జనాభా ప్రాతిపదిక సుమారు 500 మంది ఉన్న తండాలకు పంచాయతీలుగా హోదా కల్పిస్తున్నట్లు డీపీఓ ప్రభాకర్రెడ్డి అన్నారు.
తూప్రాన్ : జనాభా ప్రాతిపదిక సుమారు 500 మంది ఉన్న తండాలకు పంచాయతీలుగా హోదా కల్పిస్తున్నట్లు డీపీఓ ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన తూప్రాన్లో అంగన్వాడీ కార్యకర్తలకు ఇంటింటి సర్వే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 500 జనాభా కలిగిన గిరిజన తండాలను గుర్తించడం జరిగింది. జిల్లాలో మొత్తం 463 గిరిజన తండాలు ఉండగా అందులో 500 మందికి పైబడి జనాభా ఉన్న గ్రామాలు 50 ఉన్నాయన్నారు. త్వరలోనే ఈ తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వివరించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 182 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను త్వరలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు.
ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు : జిల్లాలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలుపొందిన ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ప్రజా ప్రతినిధులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డీపీఓ వివరించారు. వివిధ కార్యక్రమాల్లో వారు అనుసరించాల్సిన పద్ధతులు, చర్యలపై ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. త్వరలో తేదీని ఖరారు చేస్తామన్నారు.
నోటీసులు జారీ చేశాం : రూ. 1.10 లక్షల అవినీతికి పాల్పడిన మండలంలోని మనోహరాబాద్ సర్పంచ్ సంతోషకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు డీపీఓ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆమెకు చెక్ పవర్ను రద్దు చేశామని, అయితే పంచాయతీ ఉద్యోగుల వేతనాలను దృష్టిలో ఉంచుకుని ఈఓపీఆర్డీ రాఘవరావు, సర్పంచ్ జాయింట్ అకౌంట్ను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పింఛన్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోహరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీదేవిపై విచారణ కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ చిట్టిమిళ్ల శివ్వమ్మ, పంచాయతీ ఈఓ ైెహ మద్ అలీ, ఆర్డబ్ల్యూ ఏఈఈ రాజ్యలక్ష్మి, వార్డు సభ్యులు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
21 నుంచి పారిశుద్ధ్య వారోత్సవాలు
సంగారెడ్డి అర్బన్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 21వ తేదీ నుంచి 26 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.