
అతడి జీవితాన్ని రోడ్డుకీడ్చిన 'ఫన్నీ వీడియో'
ప్రత్యక్షంగా మన కళ్ల ముందు జరిగిన సంఘటనల విషయంలోనే మనం కొన్నిసార్లు పొరపాటు పడుతుంటాం. అదే ఎవరో తీసిన వీడియోను చూసి అదే నిజమనుకొని నమ్మేస్తే ఏమవుతుంది?
న్యూఢిల్లీ: ప్రత్యక్షంగా మన కళ్ల ముందు జరిగిన సంఘటనల విషయంలోనే మనం కొన్నిసార్లు పొరపాటు పడుతుంటాం. అదే ఎవరో తీసిన వీడియోను చూసి అదే నిజమనుకొని నమ్మేస్తే ఏమవుతుంది? కొన్ని జీవితాలే బుగ్గవుతాయి. మొన్నటికి మొన్న జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ వీడియోను కొందరు దురుద్దేశంతో ఎడిట్చేసి ప్రసారం చేస్తే అందులో ఉన్నదే నిజమనుకొని నమ్మేశాం. కన్హయ్య కుమార్ దేశద్రోహి అని ముద్రవేశాం. ఆ మధ్య నాగాలాండ్లో ఓ నాగా యువతి తనను ఓ ముస్లిం యువకుడు రేప్ చేశారని ఆరోపించగానే అందులో వాస్తవాలను ఆలోచించకుండానే అతివేగంగా స్పందించే సోషల్ మీడియా పుణ్యమా అని ఆ యువకుడిని స్తంభానికి కట్టేసి చితక్కొట్టి చంపేశాం!
సలీం పీకే అనే పోలీసు హెడ్ కానిస్టేబుల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయనను, ఆయన కుటుంబాన్ని అన్యాయంగా రోడ్డుకీడ్చాం. అభాసుపాలు చేశాం. సమాజం ముందు దోషిలా నిలబెట్టాం. ఆయన జీవితంతో ఆడుకున్నాం. ‘డ్రంక్ పోలీస్ మేన్ ఆన్ ఢిల్లీ మెట్రో-ఫన్నీ’ టైటిల్తో గతేడాది ఆగస్టు నెలలో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయింది. లక్షలాది మంది దాన్ని వీక్షించారు. వేలాది మంది షేర్ చేసుకున్నారు. ఆ వీడియోను చూసిన వారంతా పీకలుదాకా దాగిన ఓ పోలీసు తలుపెక్కడుందో, ఆసరాగా పట్టుకునేందుకు తాడెక్కడుందో తెలియక తికమకపడుతున్నాడని, ఆయన ప్రవర్తన ఫన్నీగా ఉందని భావించారు. షేర్ చేసుకున్నారు. ఆనందించారు. పర్యవసానంగా ఆ పోలీసు హెడ్కానిస్టేబుల్ను సలీం పీకేగా గుర్తించి పోలీసు డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. ఆ కారణంగా ఆయన భార్యకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు వాస్తవం తెలిసి తిరిగి ఆయన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగంలోకి తీసుకుంది. వాస్తవానికి అసలు ఏం జరిగింది?
ఆ పోలీసుకు ఏడాది క్రితమే హార్ట్ఎటాక్, సెమీ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. కాస్త మూర్ఛరోగం కూడా ముంచుకొచ్చింది. మాట కూడా తడబడడం ప్రారంభమైంది. ఆయన తాగాడని మనం భావించిన రోజున ఆరోగ్యం బాగా లేకున్నా ఆ పోలీసు సిన్సియర్గా ఉద్యోగం చేశారు. మెట్రో రెలైక్కినప్పుడు అనారోగ్యం కారణంగా ఆయన కాళ్లు నేలమీద సరిగ్గా నిలవలేదు. చేతులు ఆడలేదు. తలుపెక్కడుందో తెలియలేదు. మాట తడబడింది. ఒళ్లు తూలింది. మనమేమో పీకలదాకా తాగాడుకున్నాం. ‘ఫన్నీ’ వీడియో వార్తను తాటికాయంత అక్షరాలతో ఫస్ట్ పేజీలో ప్రచురించిన మీడియా ఆయన ఏ తప్పు చేయలేదని తెలిసి తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్న విషయాన్ని విస్మరించింది. ఆ వార్తను లోపలి పేజీల్లో కూడా కనీసం సింగిల్ కాలంగా కూడా వేయలేదు.
ఆయన్ని ఉద్యోగంలోకి తీసుకున్న విషయం గురించి తెలియని సమాజం ఆ పోలీసును ఇప్పటికీ పోలీసు ఉద్యోగానికే మచ్చ తెచ్చాడని భావిస్తోంది. సమాజం దృష్టిలో ఆయన ఇప్పటికీ ద్రోహియే. ఈ పాపం ఎవరిది? తప్పుగా అర్థం చేసుకున్న సోషల్ మీడియాదా! సోషల్ మీడియా ఒత్తిడికి తొందరపడి చర్య తీసుకున్న పోలీసులదా? పొరపాటు పడిన మన కళ్లదా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరి బాధ్యత ఎంత ఉన్నా ఆ పోలీసు మాత్రం సుప్రీం కోర్టుకు ఎక్కారు. పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం నష్టపరిహారం కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. పరిహారం ఎవరు చెల్లించాలి? మనకళ్లతో చూసిందేకాదు, మన కళ్లముందు జరిగింది కూడా కొన్ని సార్లు నమ్మలేం. ‘నిజం’కు కూడా నాలుగు కోణాలుంటాయని ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు అకిరా కురసొవా ‘రషోమాన్’ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు.