మూడు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి ఒకేరకమైన చార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదన సిద్ధమవతోంది.
సాక్షి, ముంబై: మూడు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి ఒకేరకమైన చార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదన సిద్ధమవతోంది. ఎన్నికల ఫలితాల తరువాత ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే పేద, మధ్య తరగతి వినియోగదారులకు ఎంతో ఊరట లభించనుంది. విద్యుత్శాఖ ఈ ప్రతిపాదనను లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి పంపించింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల ఫలితాల పర్వం పూర్తికాగానే దీనిపై చర్చించి, శాసనసభ ఎన్నికలకు ముందే అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్శాఖ స్పష్టం చేసింది.
ముంబైతో పాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో సుమారు 50 లక్షల వరకు ప్రైవేటు విద్యుత్ కంపెనీల వినియోగదారులున్నారు. ముఖ్యంగా ముంబైలో అత్యధిక శాతం టాటా, బెస్ట్, రిలయన్స్ తదితర విద్యుత్ సంస్థల వినియోగదారులున్నారు. కొద్ది మంది మాత్రమే ప్రభుత్వానికి చెందిన మహావితరన్ విద్యుత్ కంపెనీ వినియోగదారులున్నారు. కాగా కొందరికి యూనిట్కు రూ.4, మరికొందరికి రూ.6 చొప్పున, ఇంకొందరికి రూ.7 చొప్పున చార్జీలు వేస్తున్నారు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు కోటిన్నర విద్యుత్ వినియోగదారులకు 20 శాతం చార్జీలు తగ్గించి కొంత మేర ఊరట కల్గించింది.
అదే సమయంలో ముంబై, శివారు ప్రాంతాల వినియోగదారులకు ఎలాంటి రాయితీ ప్రకటించకపోవడంతో తమను నిర్లక్ష్యం చేసిందనే భావన ముంబైకర్లలో నాటుకుపోయింది. ఆ సమయంలో నగరవాసులను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు రిలయన్స్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ముంబైలో కూడా 20 శాతం విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దీంతో తేరుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ అందుకు సంబంధించిన ప్రతిపాదన రూపొం దించి, రెగ్యులేటరీ కమిషన్కు పంపించింది. ఒకవేళ ఈ ప్రతిపాదనను అమలుచేస్తే విద్యుత్ శాఖపై సుమారు రెండు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఈ భారాన్ని 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారి నుంచి వసూలు చేయాలని భావిస్తోంది.