మాజీ ప్రధాన మంత్రి వాజ్పేయ్ 89వ జన్మదినం పురస్కరించుకొని పట్టణంలోని బీజేపీ పట్టణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది
భివండీ, న్యూస్లైన్: మాజీ ప్రధాన మంత్రి వాజ్పేయ్ 89వ జన్మదినం పురస్కరించుకొని పట్టణంలోని బీజేపీ పట్టణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది. టెలిపాడ ఆగ్రా రోడ్డులో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ మహేశ్ చౌగులే నేతృత్వంలో జరిగిన ఈ శిబిరాన్ని ఉదయం తొమ్మిది గంటలకు బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్యామ్ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్ చౌగులే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మాజీ ప్రధాని వాజ్పేయ్ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. స్థానికులతో పాటు కార్యకర్తలు కూడా పాల్గొని రక్తదానం చేశారన్నారు. 70 మంది రక్త బాటిళ్లను సేకరించారని తెలిపారు.
రక్తదానం చేసిన వారికి అల్పాహారంతో పాటు గుర్తింపు పత్రాన్ని అందజేశామని మహేశ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నీలేశ్ చౌదరి, సభాపతి మురళి మచ్చ, సామాజిక కార్యకర్తలు అనిల్ పాటిల్, రవి పాటిల్, వినోద్ పాటిల్, సచిన్ పాటిల్, పార్టీ ప్రముఖ కార్యాకర్తలు కముటం సుధాకర్, నిష్కం భైరి, కొండ వివేక్, ఎనగందుల ఉమేశ్, మామిడాల ధన్వంతరి, వెంగళ్ శ్రీనివాస్, బొల్లు నవీన్, బూర్ల మనోజ్ తదితరులు హాజరయ్యారు.