విండీస్‌ 45 ఆలౌట్‌ 

West Indies skittled for 45 as England win T20 series - Sakshi

 రెండో టి20లో ఇంగ్లండ్‌దే గెలుపు

బాసెటెరీ: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ నెగ్గి... వన్డే సిరీస్‌ను పంచుకున్న వెస్టిండీస్‌... తమకు మంచి పట్టున్న టి20 ఫార్మాట్‌లో మాత్రం సిరీస్‌ను చేజార్చుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ (4/6) విజృంభించడంతో రెండో టి20లో వెస్టిండీస్‌ చెత్త రికార్డును నమోదు చేసింది. కేవలం 45 పరుగులకే ఆలౌటై అంతర్జాతీయ టి20 చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్‌ (2014లో శ్రీలంకపై) 39 పరుగులతో ఈ జాబితాలో ముందుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 137 పరుగులతో నెగ్గి సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. ముందుగా ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. జట్టు 32/4తో కష్టాల్లో నిలిచిన దశలో జో రూట్‌ (40 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

అనంతరం స్యామ్‌ బిల్లింగ్స్‌ (47 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడుతూ జట్టుకు మంచి స్కోరు అందిం చాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో అలెన్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ను జోర్డాన్‌ ముప్పుతిప్పలు పెట్టాడు. జోర్డాన్‌తో పాటు డానియల్‌ విల్లీ (2/18), రషీద్‌ (2/12), ప్లంకెట్‌ (2/8) కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆతిథ్య జట్టు 11.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. హెట్‌మైర్‌ (10), బ్రాత్‌వైట్‌ (10) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 నేడు జరుగుతుంది.       

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top