
క్రికెట్ అభివృద్ధికి మీరు చేస్తున్నదేమిటి?
దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చే స్తున్నదేమీ లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ లోధా
బీసీసీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చే స్తున్నదేమీ లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బీసీసీఐ చేసుకున్న అప్పీల్పై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. ‘దయచేసి లోధా కమిటీ నివేదికను అమలు చేయలేమని చెప్పకండి’ అంటూ బీసీసీఐ లాయర్లనుద్దేశించి కోర్టు చురకంటించింది. బీసీసీఐ పరిపాలనా విభాగం యాంత్రికంగా తయారయిందని ఆరోపించింది. అలాగే రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బోర్డు చేసే నిధుల కేటాయింపు కూడా హేతుబద్ధంగా లేదని తెలిపింది.
మొత్తం 29 క్రికెట్ సంఘాల్లో 11 సంఘాలు నయాపైసా ఎందుకు పొందడం లేదని అడిగింది. ఇదంతా పరస్పర లాభదాయక వ్యవహారంగా సాగిపోతోందని తేల్చింది. ‘నిధుల కోసం వారు ఎందుకు అడుక్కోవాలి? బోర్డులో ఉన్న అధికారుల ముఖాలు చూసి ఆయా సంఘాలకు నిధులు కేటాయిస్తున్నారా? ఏడాదిలో క్రికెట్ అభివృద్ధికోసమని క్రికెట్ సంఘాలకు రూ.480 కోట్లు కేటాయించారు. గత 20 ఏళ్లలో ఇది దాదాపు రూ.2 వేల కోట్లు ఉండాలి.
అయితే ఈ నిధులన్నీ సక్రమంగానే ఖర్చవుతున్నాయా లేదా అని ఎప్పుడైనా పర్యవేక్షించారా? అసలు దీనిపై పర్యవేక్షణ వ్యవస్థే లేదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. గత ఐదేళ్లలో నాగాలాండ్, మణిపూర్, త్రిపుర క్రికెట్ సంఘాలకు అందించిన నిధుల వివరాలను తమ ముందు ఉంచాలని బోర్డును ఆదేశించింది.