రాణించిన విహారి

Deodhar Trophy 2018: Hanuma Vihari, Shahbaz Nadeem shine as India B beat India A in opening match - Sakshi

గెలిపించిన నదీమ్, మార్కండే

భారత్‌ ‘ఎ’పై భారత్‌ ‘బి’ గెలుపు 

న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో హనుమ విహారి (95 బంతుల్లో 87 నాటౌట్‌; 9 ఫోర్లు), బౌలింగ్‌లో షాబాజ్‌ నదీమ్‌ (3/32), మయాంక్‌ మార్కండే (4/48) రాణించడంతో భారత్‌ ‘బి’ జట్టు దేవధర్‌ ట్రోఫీలో శుభారంభం చేసింది. భారత్‌ ‘ఎ’తో మంగళవారం జరిగిన పోరులో ‘బి’ జట్టు 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా భారత్‌ ‘బి’ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. విహారి అజేయ అర్ధశతకం సాధించగా, మనోజ్‌ తివారి (52; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (41; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

‘ఎ’ బౌలర్లలో అశ్విన్‌ 2, సిరాజ్, కులకర్ణి, సిద్ధార్థ్‌ కౌల్, కృనాల్‌ పాండ్యా తలా ఒక వికెట్‌ తీశారు. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన ‘ఎ’...  పృథ్వీ షా (7) విఫలమవగా, 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (114 బంతుల్లో 99; 11 ఫోర్లు, 1 సిక్స్‌), అశ్విన్‌ (54; 5 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. దీంతో లక్ష్యం దిశగా పయనించింది. 210/5 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే మయాంక్‌ మార్కండే, నదీమ్‌ల స్పిన్‌ మ్యాజిక్‌తో అనూహ్యంగా 8 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లు కోల్పోయి 218 స్కోరు వద్ద ఆలౌటైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top