సంతాప సభలో కంటతడి పెట్టిన జాన్వీ

Jhanvi Kapoor Became Emotional In Sridevi Prayer Meeting - Sakshi

చెన్నై : ప్రముఖ సినీనటి శ్రీదేవి సంతాప సభ సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ కంటతడి పెట్టింది. గత నెల 24వ తేదీన దుబాయిలో హఠాన్మరణం పొందిన  శ్రీదేవికి ఆదివారం చెన్నైలో సంతాపసభను నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలోని హోటల్‌లో నిర్వహించిన ఈ సంతాప సభకు బోనీకపూర్, ఆయన కూతుర్లు జాన్వి,ఖుషీ, శ్రీదేవి సోదరి శ్రీలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అతిలోక సుందరి శ్రీదేవికి మూగబోయిన గొంతుతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు  మౌనంగానే నివాళులర్పించారు.

కాగా ముంబై నుంచి బీఎస్‌పీ పార్టీ నేత అమర్‌సింగ్, టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దగ్గుబాటటి సురేష్‌ బాబు తదితరులు శ్రీదేవి సంతాపసభలో పాల్గొన్నారు. శ్రీదేవి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించిన సినీ ప్రముఖులు, బంధువులు, ఆప్తులు శ్రీదేవితో తమ అనుభవాలను పంచుకోకుండానే, ఎలాంటి ఉపన్యాసాలు లేకుండా మౌనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీదేవి కుటుంబ సభ్యులను సినీ ప్రముఖులు ఓదార్చారు. ఆ సమయంలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కంటతడి పెట్టింది.

మరోవైపు ఈ సంతాప సభకు మీడియాను అనుమతించలేదు. మీడియాకు అనుమతి లేదని చెప్పినా, ఎందుకు వచ్చారని శ్రీదేవి కుటుంబీకులు ప్రశ్నించడంతో ఎలక్ట్రానిక్‌ మీడియా బృందం హోటల్‌ ముందు భాగంలోని ఉండి సంతాప సభకు వచ్చినవారిని చిత్రీకరించారు.  

ఇక చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న శ్రీదేవి నివాసానికి ఆదివారం ఉదయం ప్రముఖ హీరో అజిత్‌, షాలిని దంపతులు వెళ్లి అక్కడ ఆమెచిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీదేవి కుటుంబసభ్యులను ఓదార్చారు. మరోవైపు దక్షిణ భారత నటీనటుల సంఘం నివాళులు అర్పించింది. నిన్న ఉదయం స‍్థానిక సంఘ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీదేవి చిత్రపటానికి సంఘ నిర్వాహకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీనియర్‌ నటుడు శివకుమార్‌, నటి అంబిక, కుట్టిపద్మిని, సంఘ కోశాధికారి కార్తీ పాల్గొన్నారు.

Read latest South India News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top