
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనరల్ సెక్రెటరీగా ఉన్న కె.శివకుమార్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసిన లేఖలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ లెటర్ హెడ్ ఉపయోగించి ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా శివకుమార్ ఇచ్చిన ప్రకటనను తీవ్ర క్రమశిక్షణ రాహిత్యంగా భావించినట్లు తెలిపింది. ఈ విషయమై క్రమశిక్షణా సంఘం సభ్యులు అత్యవసరంగా చర్చించి ఆయన్ను శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ మద్దతు ఇవ్వటం లేదని పేర్కొంది. ఇది పార్టీ అధికారిక విధానం అని, ఈ విధానాన్ని పార్టీ ఇంతకుముందే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలన్న అంశం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ల ఆత్మసాక్షి మేరకే ఈ నిర్ణయాన్ని వదిలేసిందని స్పష్టం చేసింది.శివకుమార్ తప్పుడు ప్రకటనను కొన్ని చానళ్లు టెలీకాస్ట్ చేసిన నేపథ్యంలో ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా అధికారిక విధానాన్ని ప్రజలకు తెలియజేస్తున్నట్లు వెల్లడించింది.