‘ఆయన మాటలతో ఏపీ పరువు పోతోంది’ | YSRCP MLA Fire On Chandrababu Over Amaravati Construction | Sakshi
Sakshi News home page

Oct 12 2018 3:22 PM | Updated on Oct 12 2018 3:49 PM

YSRCP MLA Fire On Chandrababu Over Amaravati Construction - Sakshi

అమరావతిలో ఒలంపిక్స్‌ అంటా? గెలిచినోళ్లకు నోబెల్‌ బహుమతా? ఇదెక్కడి విడ్డూరం.

సాక్షి, హైదరాబాద్‌: ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష దోరణిలో ఆర్థిక సంఘానికి రిపోర్టు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆనాడే ఏపీకి ప్యాకేజీకి ఒప్పుకోవద్దని టీడీపీ ప్రభుత్వానికి సూచిస్తే.. మగ బిడ్డను కంటానని అంటే ఏ అత్తయినా వద్దంటుందా అన్న మాటలను మర్చిపోయారా అంటూ టీడీపీ నాయకులకు గుర్తు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాటలను లెక్కలు చేయకుండా హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దు అంటూ చంద్రబాబు తీర్మానాలు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
ఒలంపిక్స్‌ అంట.. గెలిచినోళ్లకు నోబెలా?
రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఉందని అబద్దాలు చెబుతున్నారని, వాస్తవానికి రాయలసీమలో సాగు దెబ్బతిందని వివరించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానిది తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. పరిశ్రమ రంగం, సేవా రంగం పడిపోయాయని అయినా రాష్ట్రం అభివృద్ది చెందుతుందనడం సరికాదన్నారు. చంద్రబాబు మాటలతో రాష్ట్రం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పలు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారిన మండిపడ్డారు. రాజధాని కట్టడానికి లక్ష కోట్లు అవుతాయని గతంలో చెప్పిన చంద్రబాబే.. ఇప్పుడు రెండు వేల కోట్లు ఇస్తే చాలు అనండం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతి సుందరమైన నగరం అమరవాతి చెప్తున్నారని, కానీ ఇక్కడ కంప మొక్కలు అలానే ఉన్నాయని ఎద్దేవ చేశారు. ఒలంపిక్స్‌ అమరావతిలో జరుపుతామని.. గెలిచిన వాళ్లకి నోబెల్‌ ఫ్రైజ్ అంటున్నారని.. కనీసం ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement