చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు

YS Bharathi Reddy Election Campaign In Pulivendula - Sakshi

సాక్షి, పులివెందుల రూరల్‌/సింహాద్రిపురం: చంద్రబాబు చెప్పే మాటలను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి సతీమణి వైఎస్‌ సమతారెడ్డి అన్నారు. మంగళవారం సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 600 అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నేరవేర్చలేదన్నారు. రాష్ట్రాభివద్ది జరగాలంటే, రాజన్న ఆశయాలు నెరవేరాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. తండ్రిబాటలోనే వైఎస్‌ జగన్‌ నడుస్తున్నారన్నారు. వైఎస్‌ ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేస్తారని చెప్పారు.

అంతకుముందు వైఎస్‌ భారతిరెడ్డి, వైఎస్‌ సమతారెడ్డిలకు అంకాలమ్మ గూడూరులో నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో మహిళలు వారికి బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిల ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ..వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కార్యక్రమంలో సింహాద్రిపురం మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top