ఇమామ్లకు రూ. 10వేలు, మౌజన్లకు రూ.ఐదు వేలు
మనం అధికారంలోకి రాగానే అందజేస్తాం
దుల్హాన్ పథకం కింద తల్లిదండ్రులకు రూ. లక్ష ఆర్థికసాయం
ఆలయాలు, చర్చీలను కూడా అభివృద్ధి చేస్తాం
ముస్లింలతో ముఖాముఖిలో వైఎస్ జగన్
సాక్షి, హసనాపురం: తాము అధికారంలోకి రాగానే ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఇమామ్లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ. 5వేల చొప్పున నెలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దుల్హన్ పథకం కింద ఆడపిల్లల తల్లిదండ్రులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హసనాపురంలో వైఎస్ జగన్ ముస్లింలతో ముఖాముఖి భేటీలో మాట్లాడారు.
మసీదులతోపాటు ఆలయాలు, చర్చీలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముస్లింలందరినీ బీసీ-ఈ కింద చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. రూ. 1100 కోట్లు చెల్లిస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని చంద్రబాబుకు చెప్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మన అధికారంలోకి రాగానే రూ. 1100 కోట్లు చెల్లించి.. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేస్తామని, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.
మనం అధికారంలోకి రాగానే..
'దేవుడి దయవల్ల మనం అధికారంలోకి రాగానే.. మంచి పాలన అందిస్తాం. నేను చనిపోయిన తర్వాత నాన్న ఫొటోతోపాటు నా ఫొటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలి ఆరాటపడుతున్నాను. అందుకే ప్రతి పేదవాడికి మంచి చేసే ఉద్దేశంతో నవరత్నాలు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలి. ఇవాళ ఇంజినీరింగ్ చదవాలంటే లక్షలు లక్షలు ఫీజులు ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ఫీజ్ రీయింబర్స్మెంట్ రూ. 30వేలకు మించడం లేదు. దివంగత నేత, నాన్నగారి పాలనలో ప్రతి పిల్లాడికి ఉన్నత చదువులు చదివేందుకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా మనం అధికారంలోకి రాగానే.. డాక్టర్లు, ఇంజినీర్లు వంటి ఉన్నత చదువులు చదివే పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లిస్తాం. విద్యార్థుల ఖర్చుల కోసం ఏటా రూ. 20వేల చొప్పున అందజేస్తాం. బడికి వెళ్లే పిల్లలకు ఏటా రూ. 15వేలు ఇస్తాం' అని వైఎస్ జగన్ తెలిపారు
అవ్వతాతల పెన్షన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే రూ. రెండువేల చొప్పున పెన్షన్ అందజేస్తామన్నారు. వైద్యబిల్లు రూ. వెయ్యి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ కింద హైదరాబాద్ సహా ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకోవచ్చునని తెలిపారు. కుటుంబ పెద్ద ఆపరేషన్ చేయించుకుంటే విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం చేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటుచేసి.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్, పెన్షన్లు, రేషన్ కార్డులను 72 గంటల్లోనే మంజూరు చేస్తామని తెలిపారు.