కొంగర కలాన్‌ టు కొడంగల్‌ ప్రభంజనం వరకు..

Telangana Elections 2018 Kongara kalan To Result - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తవకముందే.. ముందుస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలనం సృష్టించారు. ప్రతిపక్షాలు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాకముందే.. ఆయన ముందస్తు ఎన్నికల ప్రకటనతో మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారు. తన నాలుగేళ్ల పాలనలోని అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ ఏర్పాటుచేసిన కేసీఆర్‌.. ఆ సభలో ముందస్తు సంకేతాలు ఇచ్చారు. సెప్టెంబర్‌ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఏకంగా 105మంది అభ్యర్థులను ప్రకటించి.. ప్రతిపక్షాలకు షాక్‌ ఇచ్చారు. వంద స్థానాలు టార్గెట్‌గా ప్రచారంలో  దూసుకుపోయిన కేసీఆర్‌.. కోమటిరెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి దిగ్గజాలను ఓడించడం ద్వారా పరిపూర్ణ విజయాన్ని అందుకున్నారు.  అసెంబ్లీ రద్దు నుంచి.. ఫలితాల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం వరకు జరిగిన పరిణామాలు తేదీల వారీగా..   

సెప్టెంబర్‌ 2న: కొంగర కలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది.  

సెప్టెంబర్‌ 6న: తెలంగాణ అసెంబ్లీ అధికారికంగా రద్దయ్యింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ గవర్నర్‌‌కు సమర్పించగా.. ఆయన ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్దర్మ సీఎంగా ఉండలాంటూ కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని శాసనసభ కార్యదర్శి ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, సీఎస్ ఎస్.కె. జోషికి అందజేయడం కూడా చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే 105 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. 

సెప్టెంబర్‌ 7న: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’తో కేసీఆర్ ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన అక్కడ నుంచి బహిరంగ సభకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్, కాంగ్రెస్‌ నాయకురాలు డికే ఆరుణలు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. 

సెప్టెంబర్‌ 11:  రాష్ట్రానికి ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌ కుమార్‌తో
పాటు ఇతర అధికారులతో సమావేశమ య్యారు.

ఓటర్ల జాబితా కూర్పుకు షెడ్యూల్‌
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల: 10-09-2018
అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ: 10-09-2018 నుంచి 25-09-18
గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు: 15-09-2018, 16-09-2018 రెండు రోజులు
అభ్యంతరాల తర్వాత సవరణల లిస్టు: 04-10-2018
ఓటర్ల జాబితా ముద్రణ: 07-10-2018
తుది జాబితా: 08-10-2018 (కోర్టు తీర్పు అనంతరం 12-10-18న తుది జాబితా విడుదల చేశారు)

అక్టోబరు 3, 4, 5 తేదీల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిజామాబాద్, మహబూబ్‌నగర్‌(వనపర్తి), నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలు నిర్వహించారు.

అక్టోబర్‌ 4: జోగులాంబ- గద్వాల జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్‌ పూరించింది . జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 

అక్టోబర్‌ 5: ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ టీపీసీసీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో తుది ఎన్నికల జాబితాపై హైకోర్టు స్టే ఇచ్చింది

అక్టోబర్‌ 12: అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ సహా ఇతరులు వేసిన పిటీషన్లను హైకోర్టులో ధర్మాసనం కొట్టివేసింది.

అక్టోబర్‌ 20:  తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్‌ గాంధీ (భైంసా, కామారెడ్డి) ప్రారంభించారు. ఓవరాల్‌గా రాహుల్‌ గాంధీ 6 సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని 26 నియోజకవర్గాల్లో 17 సభలు నిర్వహించారు.

  • ఎన్నికల షెడ్యూల్‌ 06-10-18
  • నోటిఫికేషన్‌ 12-11-18
  • నామినేషన్ల గడువు 19-11-18
  • పరిశీలన 20-11-18
  • ఉపసంహరణ 22-11-18
  • పోలింగ్‌ 07-12-18
  • ఓట్ల లెక్కింపు 11-12-18

అక్టోబర్‌ 20: 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేశారు.
నవంబర్‌ 2: 28 మంది సభ్యులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేశారు.
నవంబర్‌ 13: 65 మంది సభ్యులతో కాంగ్రెస్‌ తొలి జాబితా, 9 మంది సభ్యులతో టీడీపీ తొలి జాబితా విడదుల చేశారు. 
నవంబర్‌ 14: 10 మంది సభ్యులతో కాంగ్రెస్‌ రెండో జాబితా, ఇద్దరి సభ్యులతో టీడీపీ రెండో జాబితా విడుదల చేశారు.
నవంబర్‌ 14: గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌, సిద్దిపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హరీశ్‌ రావుల నామినేషన్‌ దాఖలు చేశారు. 
నవంబర్‌ 15: 20 మంది సభ్యులతో బీజేపీ మూడో జాబితా విడుదల చేశారు. 
నవంబర్‌ 16: 7 మంది సభ్యులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేశారు. 
నవంబర్‌ 17: 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ మూడో జాబితా, టీజేఎస్‌ నలుగురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. 
నవంబర్‌ 17: హుజుర్‌ నగర్‌ ప్రజాకూటమి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. 
నవంబర్‌ 19: సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేటీఆర్‌ నామినేషన్‌, కొడంగల్‌ ప్రజాకూటమి అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. 
నవంబర్‌ 18: 25 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో జాబితా, టీజెఎస్‌ మేనిఫెస్టో విడుదల చేశారు.
నవంబర్‌ 18: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు.
నవంబర్‌ 20: టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. 
నవంబర్‌ 23: సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. 
నవంబర్‌ 26: ప్రజా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. 
నవంబర్‌ 27:  కాంగ్రెస్‌ ప్రజా మేనిఫెస్టో విడుదల చేసింది.
నవంబర్‌ 27: ప్రధాని మోదీ నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ సభల్లో పాల్గొన్నారు. 
నవంబర్‌ 28: ఖమ్మంలో తొలి సారిగా రాహుల్‌, చంద్రబాబులు కలిసి తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. 
డిసెంబర్‌ 2: టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేసింది
డిసెంబర్‌ 3: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. 
డిసెంబర్‌ 4: కొడంగల్‌లో అత్యంత ఉద్రిక్తత మధ్య టీఆర్‌ఎస్‌ ‘ప్రజా ఆశీర్వాద సభ’ను జరిగింది. కేసీఆర్‌ సభను వ్యతిరేకిస్తూ స్థానిక అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం రేవంత్‌ అరెస్ట్‌.. విడుదల వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్‌.. తన సభను రేవంత్‌ అడ్డుకోవాలని చూడటంతో కొడంగల్‌లో విజయం సాధించాలని కేసీఆర్‌ సవాల్‌గా తీసుకున్నారు. విజయం సాధించారు.   
డిసెంబర్‌ 5: గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ చివరి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. 
డిసెంబర్‌ 7: ప్రశాతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్‌. 73.2 శాతం నమోదయిన పోలింగ్‌
డిసెంబర్‌ 11: టీఆర్‌ఎస్‌ అఖండ మెజారిటీతో ఘనవిజయం సాధించింది

విస్త్రతంగా కాంగ్రెస్ ప్రచారం
సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ జాతీయ నాయకులు అహ్మద్‌ పటేల్, జైరాంరమేశ్, జైపాల్‌రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే, ఆజాద్, చిదంబరం, కపిల్‌ సిబల్, వీరప్పమొయిలీ, డి.కె.శివకుమార్, ఆనంద్‌శర్మ, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఉమెన్‌ చాందీ, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దు, అజహారుద్దీన్, ఖుష్బూ, నగ్మా, సూర్జేవాలా, అభిషేక్‌ సింఘ్వీ, మనీష్‌ తివారీ తదితరులు ప్రచారం చేశారు. స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌లతోపాటు మొత్తం 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లు  ప్రచారం నిర్వహించారు.
 
బీజేపీ దూకుడుగా ప్రచారం
ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ఫడ్నవిస్, రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోశ్‌ గంగ్వార్, జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, పురుషోత్తం రూపాల, జువాల్‌ ఓరమ్, మాజీ మంత్రి పురంధేశ్వరి సహా మొత్తం 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లు 180కి పైగా సభల్లో పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద 80కి పైగా సభల్లో పాల్గొన్నారు. 

కేసీఆర్‌ వన్‌ మ్యాన్‌ షో
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబర్‌ 19 నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. అక్టోబర్‌ 24, నవంబర్‌ 1న రెండు రోజులు మినహా ప్రతిరోజు సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొన్నారు. చివరిరోజు గజ్వేల్‌లో ఒకే సభతో ప్రచారం పూర్తిచేశారు. కొంగరకలాన్‌ సభ మినహాయిస్తే.. మొత్తం 87 బహిరంగ సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో మినహా 116 అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆయన కవర్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top