గుండె మంట చల్లారింది : లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathi Happy With Lakshmi's NTR Movie - Sakshi

సాక్షి, ఒంగోలు : ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఏపీ మినహా తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అధికారం కోసం సొంతమామకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ఈ సినిమాలో వర్మ పర్‌ఫెక్ట్‌గా చూపించారని ప్రేక్షకులు చెప్తున్నారు. ఇక పలు అవాంతరాల అనంతరం ఈ సినిమా విడుదల కావడం.. విజయవంతంగా ప్రదర్శితమవుతుండటం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆనందం వ్యక్తం చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో తన గుండెమంట చల్లారిందని ఆమె వ్యాఖ్యానించారు. 

అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి వీధి స్థాయి నాయకుడిగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. వైఎస్ షర్మిలపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, వారంతా సంస్కార హీనులని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలును మరచిపోయి నందమూరి బాలకృష్ణ ప్రవర్తిస్తున్నారని, బాలకృష్ణ ఇంటినుంచే షర్మిలపై దుష్ప్రచారం జరగడం బాధాకరమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక మహిళలను అవమాన పరచడం సరైంది కాదని హితవు పలికారు. ఆయనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం ఎన్నడూ మహిళలను కించపరచలేదని అన్నారు. మహిళలకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

(చదవండి : ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రిలీజ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top