అనకాపల్లి జనసేన రెబల్గా కొణతాల
సాక్షి, విశాఖపట్నం: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అనకాపల్లి అసెంబ్లీ జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా కొణతాల సీతారాం సోమవారం నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తనకు టిక్కెట్ ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. టీడీపీకి అనుకూలంగా గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి భాస్కర్కు టిక్కెట్ కేటాయించారని వాపోయారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. అనకాపల్లి నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా చింతల పార్థసారధి పోటీలో ఉన్నారు.
నామినేషన్ వేసేందుకు వెళుతున్న కొణతాల సీతారామ్
పవన్ కళ్యాణ్ తమను మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఇంతకుముందు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మాడుగుల టికెట్ ఇస్తామని జనసేనలో చేర్చుకొని.. చివరకు టీడీపీ వాళ్లు గెలిచేలా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చాడని మండిపడ్డారు. ఆయన చెప్పారనే.. ఇంటింటికీ తిరిగి ప్రచారం కూడా చేసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు తన కుటుంబానికి కాదని గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. (పవన్ మోసం చేశాడంటున్న మాజీ ఎమ్మెల్యే)