విపక్షాల తొత్తు మంద కృష్ణ | karne prabhakar commented over manda krishna | Sakshi
Sakshi News home page

విపక్షాల తొత్తు మంద కృష్ణ

Jan 31 2018 2:24 AM | Updated on Oct 8 2018 3:00 PM

karne prabhakar commented over manda krishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ ప్రతిపక్ష పార్టీలకు తొత్తుగా మారారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వర్గీకరణపై చిత్తశుద్ధితో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికే అఖిలపక్ష పార్టీలతో రౌండ్‌టేబుల్‌ పేరిట రాజకీయ ప్రసంగాలు చేశారన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 2004 డిసెంబర్‌లోనే ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిందని, ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్నా వర్గీకరణ చేయలేదని, అలాంటిది ఇప్పుడెలా మాట్లాడుతున్నారని కర్నె ప్రశ్నించారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉన్నందునే అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ తీర్మానం చేసిందని, కేంద్రానికి పంపిందని వారు చెప్పారు. దీనిపై కలిసి మాట్లాడటానికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంటు ఇవ్వడంలేదని, బీజేపీ నేతలకు చేతనైతే ఇప్పించాలని సవాల్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement