నెపం వేసి రుజువులు లేకుండా అరెస్ట్ చేస్తారా?
కాంగ్రెస్ నేతలు జానా, షబ్బీర్, దాసోజు
సాక్షి, హైదరాబాద్: పౌరహక్కుల నేత వరవరరావును అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వరవరరావును అరెస్టు చేయడం పౌరహక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో కుట్ర చేశాడనే నెపంతో రుజువులు లేకుండా అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...వరవరరావు గొప్ప మానవతావాది అని, మావోయిస్టులతో చర్చల సందర్భంగా గొప్ప పాత్ర పోషించారని చెప్పారు.
ఆయన అరెస్టుపై కేంద్రం విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని జానా డిమాండ్ చేశారు. వరవరరావు కుట్ర చేశారనే ఆరోపణలు నమ్మశక్యంగా లేవని మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వాలు అణచివేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాల్లోని తప్పులను ఎత్తిచూపుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న వరవరరావును అరెస్టు చేయడాన్ని టీపీసీసీ ముఖ్య అధి కార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తప్పుపట్టారు.