ప్రభుత్వానికి పతన భయం?  | BJP Ready For Operation Kamala In Karnataka | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి పతన భయం? 

May 26 2019 12:52 PM | Updated on May 26 2019 2:02 PM

BJP Ready For Operation Kamala In Karnataka - Sakshi

కనీవినీఎరుగని ఘోర పరాజయం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య సంబంధాలను చరమాంకంలోకి నెట్టింది. విజయంతో అన్నింటినీ సర్దుబాటు చేయవచ్చని ఆశించినా అలా జరగకపోవడంతో సంకీర్ణ పెద్దలకు దిక్కుతోచడం లేదు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఒక సీటును కోల్పోవడం మరో ముప్పుగా మారింది. మ్యాజిక్‌ నంబర్‌కు దగ్గరవుతున్న బీజేపీ త్వరలోనే భారీ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నందని అంచనా.   

సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఆరంభం నుంచి అయోమయం నెలకొంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రభుత్వ ఏర్పాటు ప్రచారం సాగించింది. బీజేపీ తెరవెనుక ఉంటూ ‘ఆపరేషన్‌ కమల్‌’ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏడాది కాలంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఊరించి.. ఊరించి వెనక్కి తగ్గింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంలో సార్వత్రికం ముగిసే వరకు మౌనం వహించారు. అయితే ప్రస్తుతం సార్వత్రికం ఫలితాలు కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వం మరింత సంకటంలోకి వెళ్లింది. వెంటనే కాంగ్రెస్‌ – జేడీఎస్‌ అవలోకన పేరుతో పోస్టుమార్టం సమావేశాలు నిర్వహించారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమారస్వామి వాపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే బీజేపీ చేతుల్లోకి అధికారం వెళ్తే తమ మనుగడ కష్టసాధ్యమని కాంగ్రెస్‌ భయపడుతోంది. దీంతో సీఎం పదవి మీదేనని జేడీఎస్‌ను బుజ్జగిస్తోంది.  

బీజేపీ అప్రమత్తం 
సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం సాగడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి అందరు ఒకేతాటిపై ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభు త్వంపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేలను టచ్‌ చేయొద్దని వారి మధ్య విభేదాలే ప్రభుత్వానికి కారణం అవుతాయని సూచించారు.  

వరుస భేటీల్లో జేడీఎస్‌ 
లోక్‌సభ ఫలితాల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం సాగడంతో దళపతులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవెగౌడతో సీఎం కుమారస్వామి రెండుసార్లు భేటీ అయ్యారు. అదేవిధంగా సీఎం కుమారస్వామితో జేడీఎస్‌ మంత్రులు సమావేశమయ్యారు. జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌.విశ్వనాథ్‌ భేటీ అయ్యారు. మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య సమావేశమై రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఇక  బీజేపీకి అధికారం ఇస్తే పార్టీ మనుగడ కష్టమని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ మనుగడకు గట్టి పోరాటం చేస్తోంది. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి వెళ్తారని ప్రచారం సాగినా.. కేవలం చించోళి ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ మాత్రమే వెళ్లారు.  

ఉప ఎన్నికతో మరో దెబ్బ 
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు కుందగోళ, చించోళి ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్‌కు దెబ్బ పడింది. చించోళి స్థానంలో బీజేపీ అభ్యర్థి అవినాశ్‌ జాదవ్‌ గెలవడంతో సంకీర్ణ ప్రభుత్వానికి సంఖ్య తగ్గింది. గతంలో చించోళి, కుందగోళ స్థానాలు కాంగ్రెస్‌వే. అయితే ప్రస్తుతం ఒక్క సీటు జారిపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement