
సాక్షి, డిచ్పల్లి : ఎన్నికల్లో గెలిపిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్.. గెలిచి ఆర్నెళ్లయినా పసుపుబోర్డు మాటెత్తని అబద్ధాలకోర్ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బతుకమ్మను ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన మాజీ ఎంపీ కవితను ఓ డించి, మోసపూరిత వ్యక్తిని గెలిపించడం బా ధాకరమని వ్యాఖ్యానించారు. డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పొద్దున లేస్తేనే సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని విమర్శించడమే పని పెట్టుకున్నాడని ఆరోపించారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పలువురు సీఎం కేసీఆర్ను కలిశారని,తమను తెలంగాణలో కలపాలని కోరారని చెప్పారు. మహారాష్ట్రలోనూ 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు అమలు చేయమని అక్కడఅధికారంలో ఉన్న బీజేపీకి చెప్పాలని అర్వింద్కు సవాల్ విసిరారు.
ఫ్లెక్సీ వివాదం..
చీరల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీలో ఎంపీ అర్వింద్ ఫొటో లేదని ఎవరో చెప్పడంంతో ఆయన కలెక్టర్ రామ్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఆర్డీవోకు ఫోన్ చేసి ప్రశ్నించారు. దీంతో ఆర్డీవో స్టేజీ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. అయితే, ఎమ్మెల్యే రాగా నే, పార్టీ నాయకులు ఫ్లెక్సీ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. స్టేజీపై ఫ్లెక్సీ పెట్టించాలని సూచించడంతో ఆర్డీవో ఏర్పాటు చేయించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక వ్యక్తి కోసం మా ఫొటో తీసేస్తరా ఆర్డీవో సాబ్ అని ప్రశ్నించారు. ‘ఆ వ్యక్తి రాడు, ముఖం లేదు, మంచి కార్యక్రమాలకు అడ్డుపడుతుంటాడు. అతడు ఫోన్ చేయగానే భయపడి ఫ్లెక్సీ తొలగిస్తారా..? ఏం.. మేం పని చేస్తలేమా..? ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చిత్రాలు ఉన్నాయి.. అతడు ఏం చేస్తడో చేసుకోని’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎంపీపీ భూ మన్న, జెడ్పీటీసీలు ఇందిర, జగన్, సర్పం చ్ సతీశ్రావు, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీవో సురేందర్, నేతలు గడీలరాములు పాల్గొన్నారు.