లైసెన్సులు వెనక్కి తీసుకోండి మహా ప్రభో! | Uttarakhand Liquor Traders Request Government To Surrender License | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ లైసెన్సులు వెనక్కి తీసుకోండి మహా ప్రభో!

Jun 28 2020 5:38 PM | Updated on Jun 28 2020 6:29 PM

Uttarakhand Liquor Traders Request Government To Surrender License - Sakshi

డెహ్రాడూన్‌: కోవిడ్‌ దెబ్బతో ఉత్తరాఖండ్‌లోని మద్యం దుకాణాదారులు వాటిని మూసివేసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అమ్మకాలు తగ్గిపోయి భారీ నష్టాల్లో కూరుకుపోయామని, తమ లైసెన్సులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 దుకాణాదారులు ప్రభుత్వానికి ఈమేరకు వినతులు సమర్పించారు. తమ నష్టాలకు ప్రధాన కారణం అమ్మకాలు తగ్గిపోవడం ఒకటైతే, ప్రభుత్వానికి నెలవారీ చెల్లించే కనీసం గ్యారెంటీ మొత్తం మరొకటని చెప్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 650 మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆదాయం అందించే వనరు ఇదే కావడం గమనార్హం. అక్కడ లైసెన్సు గడవు ఒక ఏడాది.
(చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్‌, చిక్కుల్లో బీజేపీ నేత)

లాక్‌డౌన్‌తో అమ్మకాలు నిలిచిపోగా.. అన్‌లాక్‌-1 అమలైనప్పటికీ డిమాండ్‌ అంతగా లేదని దుకాణాదారులు తెలిపారు. అమ్మలకాలతో సంబంధం లేకుండా నెలకు రూ.40 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించాల్సి ఉంటుందని జైస్వాల్‌ అనే దుకాణదారు చెప్పారు. అందుకే లైసెన్సులు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని, ఇప్పటి వరకు రిప్లై రాలేదని తెలిపారు. ఇంతకు ముందు అమ్మకాలపై 20 శాతం వాటా ఉండేదని, ఇప్పుడు దానిని 14.5 శాతానికి తగ్గించారని చెప్పారు. ఇది కూడా తమ నష్టాలకు ప్రధాన కారణమని అన్నారు. ఇదిలాఉండగా.. లాక్‌డౌన్‌ సమయంలో బకాయిపడ్డ నెలవారీ గ్యారెంటీ మొత్తం రూ. 230 కోట్లు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మద్యం దుకాణాలపై కనికరం అవసరమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం స్పందన కోరుతూ హైకోర్టు మూడు వారాలకు విచారణ వాయిదా వేసింది.
(పామును ప‌ట్టుకోండి..)

Advertisement
 
Advertisement
Advertisement