
పనాజీ : గోవాలో బహిరంగంగా మద్యం సేవించే వారిపై జరిమానా విధిస్తామని సీఎం మనోహర్ పారికర్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా టూరిజం మంత్రి మనోహర్ అజగోంకర్ సత్ప్రవర్తన కలిగిన టూరిస్టులను మాత్రమే గోవా స్వాగతిస్తుందని చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, సహజ సౌందర్యం, గోవా స్ఫూర్తిని సంరక్షించే వారికే తాము ఆహ్వానం పలుకుతామని అన్నారు. బాలికలు, మహిళలతో అమర్యాదకరంగా వ్యవహరించవద్దని ప్రజలు, పర్యాటకులను తాము కోరుతున్నామన్నారు.
భారత్తో పాటు విదేశాల్లోనూ గోవా ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నందున టూరిస్టులు తమ సంస్కృతి, గోవా అందాలను తిలకించేందుకు వస్తారని ఈ సంస్కృతిని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు.
మద్యం సేవించి, అమర్యాదకరంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించిన వారిపై విధించిన రూ 2500 జరిమానా చాలా తక్కువని, దీన్ని మరింత పెంచాలని డిమాండ్ చేశారు.