సాక్షి, న్యూఢిల్లీ : అభివృద్ధి ప్రక్రియలో గిరిజనులు, దళితులు, మైనారిటీలను విస్మరిస్తే ఐఎస్ వంటి ఉగ్ర సంస్థలు పుట్టుకొస్తాయని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హెచ్చరించారు. వృద్ధి పరంపరలో అందరినీ భాగస్వాములను చేయాలని గిరిజనులు, దళితులు, మైనారిటీలను దూరం పెట్టడం ప్రమాదకరమని మోదీ సర్కార్పై ఆయన విమర్శలు గుప్పించారు. ఏడు దశాబ్ధాల కిందట మనకు స్వతంత్రం లభించిన నేపథ్యంలో గ్రామీణ భారత్ను ఆధునిక భారత్గా ఆవిష్కరించామని అన్నారు.
అభివృద్ధి ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేయడమనే విధానంతో అప్పుడు ముందుకెళ్లామన్నారు. మోదీ ప్రభుత్వం అణగారిన వర్గాలను వృద్ధి ప్రక్రియలో విస్మరిస్తోందని, అభివృద్ధి ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడం ప్రమాదకరమని జర్మనీ పర్యటనలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ హెచ్చరించారు. నరేంద్ర మోదీ సర్కార్ హయాంలో పేదలకు సమాన అవకాశాలు దక్కకపోవడం, నిరుద్యోగం, మూకహత్యలు వంటి అనర్థాలు చోటుచేసుకున్నాయన్నారు.