
‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్ ప్రారంభించిన రాష్ట్రపతి
‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు.
న్యూఢిల్లీ: భ్రూణహత్యలు, లింగవివక్షపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ కుమార్తెలతో సెల్ఫీ తీసుకుని వాటిని ఈ యాప్లో అప్లోడ్ చేయాలని, తద్వారా లింగవివక్షకు ఫుల్స్టాప్ పెట్టాలని పిలుపునిచ్చారు.
ఆడ శిశువును గర్భంలోనే చిదిమేయటం, ఆడ పిల్లలను చిన్నచూపు చూడటం వంటి వాటికి వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని వివరించారు. బాలికల సంఖ్యను పెంచటం, లింగ అసమానతలను తగ్గించటమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రపతి కోరారు. హర్యానా రాష్ట్రం జిండ్ జిల్లా బీబీపూర్ గ్రామ సర్పంచి సునిల్ జగ్లాన్ అనే వ్యక్తి 2015లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఈ సందర్భంగా జగ్లాన్ చేస్తున్న కృషిని రాష్ట్రపతి అభినందించారు.