57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు | Elections for 57 Rajya Sabha seats on June 11 | Sakshi
Sakshi News home page

57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు

May 13 2016 2:11 AM | Updated on Aug 14 2018 5:56 PM

57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు - Sakshi

57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు విడుదల చేసింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదల
* మే 24న నోటిఫికేషన్; జూన్ 11న ఎన్నికలు
* ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నిక

సాక్షి, న్యూఢిల్లీ:  రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యుల పదవీ కాలం జూన్-ఆగస్టు మధ్య పూర్తవుతున్నందున జూన్ 11న ఎన్నికల నిర్వహిస్తామని పేర్కొంది. పదవీ విరమణ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(బీజేపీ), జేడీ శీలం(కాంగ్రెస్), సుజనా చౌదరి, సీఎం రమేశ్(టీడీపీ)లు, తెలంగాణ నుంచి గుండు సుధారాణి(ప్రస్తుతం టీఆర్‌ఎస్), వి.హనుమంతరావు( కాంగ్రెస్)ల పదవీ కాలం ముగియనుంది. వీరితో పాటు కర్ణాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడి పదవీకాలం జూన్ 30తో పూర్తవుతుంది.
 
ప్రముఖులు వీరే: పదవీకాలం పూర్తిచేసుకోబోతున్న ప్రముఖుల్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు(హర్యానా), గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌధురి బీరేందర్ సింగ్(హర్యానా), పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ(యూపీ), విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్(మహారాష్ట్ర), జేడీయూ నేత శరద్ యాదవ్(బిహార్)లు ఉన్నారు. కాంగ్రెస్ ప్రముఖుల్లో మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్(ఆంధ్రప్రదేశ్), మొహిసినా కిద్వాయ్(ఛత్తీస్‌గఢ్), ఆస్కార్ ఫెర్నాండెజ్ (కర్ణాటక), అంబికా సోనీ(పంజాబ్) తదితరులు ఉన్నారు.
 
యూపీ నుంచి అత్యధికంగా 11 మంది
పదవీ విరమణ చేస్తున్నవారిలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన వారు చెరో 14 మంది ఉండగా, బీఎస్పీకి చెందిన ఏడుగురు, జేడీయూ 5, ఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకేల నుంచి ముగ్గురు చొప్పున, డీఎంకే, ఎన్సీపీ, టీడీపీల నుంచి ఇద్దరేసి, శివసేన నుంచి ఒక్కరు ఉన్నారు. స్వతంత్ర సభ్యుడైన మాల్యా మే 5న రాజీనామా చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి 11, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి చెరో ఆరు, బిహార్ నుంచి 5, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి చెరో నాలుగు, మధ్యప్రదేశ్, ఒడిశా 3, హరియాణా, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి రెండేసి చొప్పున, ఉత్తరాఖండ్ నుంచి ఒక స్థానం ఖాళీ అవుతున్నాయి.
 
24 ఏళ్ల తర్వాత మళ్లీ సాఫీగా...

న్యూఢిల్లీ: బుధవారం ముగిసిన 16వ లోక్‌సభ 8వ సమావేశాలు కొత్త చరిత్ర సృష్టిం చాయి. సభలో అవాంతరాలతో ఒక్క నిమి షం కూడా వాయిదా పడకుండా సాఫీ గా సాగటం 24 ఏళ్లలో ఇదే తొలిసారి అని లోక్‌సభ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో 1990, 1992లో మాత్ర మే దిగువసభ ఇంత సాఫీగా సాగిం దన్నారు.

‘1992లో పదో లోక్‌సభ మూడో సమావేశాల్లో.. శివరాజ్‌పాటిల్ స్పీకర్‌గా ఉన్నపుడు 49 సార్లు భేటీ అయిన సభ అవాంతరాల్లేకుండా సాగింది. 1990లో తొమ్మిదో లోక్‌సభ రెండో సమావేశాల్లో.. రబీరే స్పీకర్‌గా ఉన్నపుడూ వాయిదాల్లేకుండా సాగింది’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ సిట్టిం గ్ సభ్యుడు ప్రవీణ్ రాష్ట్రపాల్ మృతికి సం తాపం తెలుపుతూ రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. పదవీ విరమణచేసిన 58 మందికి వీడ్కోలు అనంతరం శుక్రవారం నిరవధిక వాయిదా వేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement