కోర్టు చొరవతో కాపురం నిలిచింది! | court makes family togather | Sakshi
Sakshi News home page

కోర్టు చొరవతో కాపురం నిలిచింది!

Jan 19 2018 2:49 AM | Updated on Jan 19 2018 2:49 AM

court makes family togather - Sakshi

బిర్భూమ్‌: న్యాయస్థానాలు కేవలం దోషుల్ని శిక్షించడమే కాదు మానవత్వంతోనూ వ్యవహరిస్తాయని మరోసారి రుజువైంది. పశ్చిమబెంగాల్‌లో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఓ జంట విషయంలో న్యాయమూర్తి వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంది. బెంగాల్‌లోని బిర్భూమ్‌కు చెందిన గౌతమ్‌ దాస్, అహనాలకు ఇటీవల వివాహమైంది.

అత్తామామల వేధింపులు ఎక్కువకావడంతో దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని జనవరి 16న సూరీలోని జిల్లా కోర్టును ఆశ్రయించారు. అయితే కుటుంబ సభ్యులతో కాకుండా విడిగా ఓ హోటల్‌లో కొద్దిరోజులు గడపాలనీ, సమస్యను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి పార్థసారథి సేన్‌ వీరికి సూచించారు. 

హోటల్‌లో ఉండేందుకు తన వద్ద తగిన నగదు లేదని గౌతమ్‌ కోర్టుకు చెప్పడంతో హోటల్‌ బిల్లు మొత్తం కోర్టు నిధుల నుంచి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మొత్తాన్ని తానే భరిస్తానని ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌ గంగూలీ ముందుకొచ్చారు. దీనికి కోర్టు అంగీకరించడంతో ఆ జంటకు గంగూలీ బిర్భూమ్‌లోని ఓ హోటల్‌లో సూట్‌ బుక్‌ చేశారు. ప్రస్తుతం వీరు విడిపోవాలనుకోవడం లేదని గంగూలీ మీడియాకు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement