వైద్యుల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా బ్లాక్ డే

Attack on doctors: IMA declares April 23 as black day - Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి అంటువ్యాధిలా అంద‌రినీ క‌బ‌లిస్తోంది. అయినా ప్రాణాల‌ను ఫణంగా పెట్టి క‌రోనా రోగుల‌కు డాక్ట‌ర్లు సేవ‌లందిస్తున్నారు. అయినా కొంద‌రు మాత్రం వైద్యుల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. వైద్యుల‌పై ఉమ్మివేస్తూ, దుర్భాష‌లాడుతూ భౌతిక దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. దీనికి నిర‌స‌న‌గా దేశవ్యాప్తంగా  ఈనెల 23న బ్లాక్‌డే పాటించాల‌ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయించింది.

దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని  డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం డాక్ట‌ర్లంతా న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి విధుల‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు. వైద్యుల‌కు ర‌క్ష‌ణ‌గా ఓ చ‌ట్టాన్ని రూపొందించాల‌ని కేంద్రాన్ని కోరారు.

త‌మిళ‌నాడులో క‌రోనా కార‌ణంగా ఓ వైద్యుడు చ‌నిపోతే అత‌ని అంత్య‌క్రియ‌ల‌కు స్థానికులు అడ్డుత‌గిలారు. అంతేకాకుండా వారిపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చర్య‌లు తీసుకోక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ‘కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై దాడులకు పాల్ప‌డ‌టం అన్న‌ది అత్యంత హేయ‌మైన చ‌ర్య‌. వారి శ్ర‌మ‌ను గుర్తించ‌కుండా వారిపై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. స‌రే మేం కూడా ఇంట్లో కూర్చుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అపోహలు సృష్టిస్తూ దాడుల‌కు పాల్ప‌డితే ఉపేక్షించేది లేద’ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top