ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పోలీసు పెట్రోలింగ్ కారులోని ఓ ఎస్సై దుర్మరణం చెందాడు.
బులంద్షహర్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పోలీసు పెట్రోలింగ్ కారులోని ఓ ఎస్సై దుర్మరణం చెందగా, మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి 91పై మామన్ గ్రామం వద్ద బుధవారం ఉదయం పెట్రోలింగ్లో భాగంగా జాతీయ రహదారి లింక్ రోడ్డుపై కారు ఆగి ఉన్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎస్సై రాజేందర్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం డ్రైవర్ వికాస్, మరో పోలీసు కానిస్టేబుల్ రఫీక్లు గాయపడ్డరని సిటీ ఎస్పీ ప్రవీణ్రంజన్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మీరట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారయ్యారని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.