
శ్రీదేవి రాగం
ఏ భాషలో సినిమా చేస్తే అదే తన మాతృభాష అన్నంతగా ఒదిగిపోయే తారలు అరుదుగా ఉంటారు
ఏ భాషలో సినిమా చేస్తే అదే తన మాతృభాష అన్నంతగా ఒదిగిపోయే తారలు అరుదుగా ఉంటారు. అలాంటివాళ్లలో శ్రీదేవి ఒకరు. దక్షిణ, ఉత్తరాది భాషల్లో తిరుగులేని తారగా ఒకప్పుడు వెండితెరను ఏలారు ఈ జగదేక సుందరి. అందుకే ఆమె సినిమాల్లో నటించడం మానేసినా, ఎవరూ మర్చిపోలేదు. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ద్వారా రీ-ఎంట్రీ అయినప్పుడు అభిమానులు సంబరపడిపోయారు. ఆ తర్వాత తమిళంలో ‘పులి’ చిత్రంలో నటించారు శ్రీదేవి. తాజాగా ‘శ్రీశ్రీ దేవరాగం’ అనే మలయాళ చిత్రంలో నటించడానికి శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఇది మలయాళ ప్రేక్షకులకు తీపి వార్త అనే చెప్పాలి. ఎండీ రాజేంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీదేవిది అతిథి పాత్ర. ‘‘కథ గురించి శ్రీదేవితో మాట్లాడటం జరిగింది. ఆమె ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో నటించేందుకు ఒప్పుకున్నారు’’ అని రాజేంద్రన్ పేర్కొన్నారు. 1969లో విడుదలైన ‘కుమార సంభవం’ మలయాళంలో శ్రీదేవికి మొదటి చిత్రం. 1996లో విడుదలైన ‘దేవరాగం’ అక్కడ ఆమెకు చివరి చిత్రం. సో... ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత మలయాళ తెరపై శ్రీదేవి కనిపించనున్నారన్న మాట.