నా భర్త వేధిస్తున్నాడు: గాయని కౌసల్య

నా భర్త వేధిస్తున్నాడు: గాయని కౌసల్య - Sakshi


సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడంలేదు. తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. గత కొంత కాలంగా తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా తన భర్తపై 498ఎ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు మూడు విడతలుగా ఇద్దరికీ కౌన్సెలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలో కౌన్సెలింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.



అయినా బాలసుబ్రహ్మణ్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆమె ఫిర్యాదు మేరకు అతడిపై 506, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తానేమీ చేయలేదని, కావాలనే ఫిర్యాదు చేస్తోందని బాలసుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం పద్మావతి యూనివర్సిటీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేశారు. చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది. 1999లో 'మీ కోసం' సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. పలు స్టేజి కార్యక్రమాలలో కూడా ఆమె తరచు పాటలు పాడుతుంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top