హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ ఎత్తున కుళ్లిన చికెన్ లభ్యమైంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (H-FAST) బృందం అరెస్ట్ చేసింది. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె.నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న 'మెసర్స్ ఎస్.పి.ఆర్ (SPR) చికెన్' ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
సూరజ్ పాల్ (66) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు కూకట్పల్లిలోని రాజీవ్ గాంధీ నగర్లో ఉంటాడు. అతడి షాపు నుంచి సుమారు 352 కిలోల కుళ్లిన చికెన్ (రెక్కలు, రొమ్ము భాగం, కాలేయం వంటి భాగాలు)ను స్వాధీనం చేసుకున్నారు. అతడి సంస్థకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ గడువు ముగిసింది. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని, నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోకు హెచ్-ఫాస్ట్ బృందం అప్పగించింది.


