
‘దేవోంకీ దేవ్ మహదేవ్’(హరహర మహాదేవ శంభో శంకర) సీరియల ఫేం పూజా బెనర్జీ తన చిరకాల మిత్రుడు, నటుడు కునాల్ వర్మను వివాహమాడారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అదేంటి కరోనా లాక్డౌన్ కాలంలో ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ స్టార్ జంట గత నెలలోనే కోర్టు మ్యారేజీ ద్వారా తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఈలోగా మహమ్మారి కరోనా విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో పూజా, కునాల్ నిరాశకు గురయ్యారు. అయితే లాక్డౌన్ కారణంగా వివాహ వేడుకలను రద్దు చేసుకున్న ఈ జంట.. వాటి కోసం ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని పూజా, కునాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. గతేడాది దుర్గా పూజలో సింధు ఖేల్కు సంబంధించిన ఫొటో షేర్ చేసిన పూజా.. ‘‘ఈరోజు మా పెళ్లి వేడుక జరగాల్సింది. అయితే దానిని మేం రద్దు చేసుకున్నాం. అధికారికంగా మేము ఇప్పుడు భార్యభర్తలం. మా తల్లిదండ్రులు, తాతా- బామ్మల ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది తమ ప్రియమైన వాళ్లను కోల్పోవడం హృదయాలను కలచివేస్తోంది. వారి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. అదే విధంగా మా వంతు సాయంగా పెళ్లి వేడుకల కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును విరాళంగా ఇస్తున్నాం. మళ్లీ ఈ ప్రపంచం త్వరలోనే పూర్వస్థితికి రావాలని ఆశిస్తున్నాం. జై మాతాది’’అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో నూతన వధూవరులకు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు సాయపడాలన్న మీ దాతృత్వ గుణం ఆదర్శనీయం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.