నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు
సినీ నటుడు విజయ్ సాయి భార్య వనిత
సాక్షి, హైదరాబాద్: తానెప్పడు తన భర్తను ఇబ్బంది పెట్టలేదని సినీ నటుడు విజయ్ సాయి భార్య వనిత చెప్పారు. రెండేళ్లుగా తమ విడాకుల కేసు కోర్టులో ఉందని వెల్లడించారు. శశిధర్ ఎవరో తనకు తెలియదని, తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణవార్త తెలుసుకుని సోమవారం మధ్యాహ్నం ఆమె ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
‘విజయ్కు వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆ విషయం నేను కళ్లారా చూశాకే విడాకులు అడిగాను. సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు చేసేవాడు. అమ్మాయిలతో పరిచయాలు వద్దని చాలాసార్లు చెప్పాను. ఇలాంటి వద్దని మనిద్దరం సంతోషంగా ఉందామని చెప్పిచూసినా అతడు వినలేదు. విజయ్ ప్రవర్తన గురించి అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదు. విజయ్ నన్నెప్పుడూ మంచిగా చూసుకోలేదు. నన్ను చిత్రహింసలు పెట్టాడు. నేనెప్పుడూ బయటకు వచ్చి చెప్పుకోలేదు. విజయ్ను నేను డబ్బులు డిమాండ్ చేయలేదు. నా కూతురు వారంలో 2 రోజులు తండ్రి దగ్గర ఉండాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నా కూతుర్ని తీసుకెళ్లాడు. పాపను తీసుకునేందుకు వెళ్లినప్పుడు నన్ను కొట్టాడు. నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు. విజయ్ ఇప్పటికిప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియద’ని వనిత అన్నారు.