
ఇస్లామాబాద్/రావుల్పిండి : పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందారు. ఇస్లామిస్ట్ నిరసనకారులు శనివారం ఇస్లామాబాద్, రావుల్పిండి నగరాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామిస్ట్ నిరసనకారులను చెదరగొట్టేందుకు శుక్రవారం నుంచి ఫ్రాంటియర్ కానిస్టేబుల్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారుల మీద టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారు. సైన్యం బలప్రయోగానికి దిగడంతో.. ఆగ్రహించిన ఇస్లామిస్ట్ నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు మూకుమ్ముడిగా సైన్యం మీద భౌతిక దాడులకు దిగారు. అల్లర్లను రెచ్చగొడుతున్న 50 మంది ఇస్లామిస్ట్ నిరసనకారులను సైన్యం అదుపులోకి తీసుకుంది.
భారీగా బలగాలు
ఇస్లామాబాద్లో 2 వేల మంది నిరసనకారులను నియంత్రించేందుకు ప్రభుత్వం భారీగా సైన్యాన్ని బరిలోకి దింపింది. 8,500 మంది ఎలైట్ పోలీసులు, పారామిలటరీ బలగాలతో అల్లర్లను అదుపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
పలువురికి గాయాలు
ఇస్లామిస్ట్ నిరసనలు పాకిస్తాన్లో మిన్నంటాయి. ఈ నిరసన అల్లర్లలో 130 మంది గాయపడినట్లు పాకిస్తాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పదులో సంఖ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్లలో ఒక పోలీస్ మృతి చెందారు.
మీడియాపై నిషేధం
పాకిస్తాన్ మీడియా రెగ్యులేటింగ్ చట్టాన్ని టీవీ చానళ్లు అతిక్రమించాయన్న కారణంతో..శనివారం ప్రయివేట్ టీవీ ఛానళ్లపై అధికారులు నిషేధం విధించారు. ఇస్లామిస్ట్ నిరసనకారులపై సైనిక చర్య జరుగుతున్న సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు చేయరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్ ప్రసారాలు కొనసాగాయి.
MEDIA COVERAGE OF SIT-IN AT FAIZ-E-ABAD, ISLAMABAD pic.twitter.com/YqEGTWpFIR
— Report PEMRA (@reportpemra) November 25, 2017

