పర్యాటకులకు నోట్ల రద్దు సెగ | Sakshi
Sakshi News home page

పర్యాటకులకు నోట్ల రద్దు సెగ

Published Mon, Dec 5 2016 6:08 PM

severe cash crunch paralyzes vendor buisiness at patabasti

హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దైన నేపధ్యంలో సరైన చిల్లర అందుబాటులో లేకపోవడంతో పాతబస్తీలోని పర్యాటక కేంద్రాలను సందర్శించే పర్యాటకులకు ఇంకా తిప్పలు తప్పడం లేదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఒర్చి ఓల్డ్‌సిటీకి వచ్చినప్పటికీ... చిల్లర సమస్య పర్యాటకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధిస్తుంది. కేవలం కొత్త రూ.2000 నోట్లు అందుబాటులో ఉండటం.. దీనికి చిల్లర దొరకకపోవడంతో పాతబస్తీ పర్యాటక కేంద్రాలను సందర్శించే పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
 
ఆదివారం పర్యాటక స్థలాలన్నీ సందర్శకులతో కళకళలాడినా...చిల్లర సమస్యతో పర్యాటకులు పడరాని పాట్లు పడ్డారు. సాధారణంగా సెలవు రోజుల్లో చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహాల్లా ప్యాలెస్, జూ పార్కు తదితర పర్యాటక కేంద్రాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతాయి. ఈ ఆదివారం కూడా పర్యాటకుల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ...చిల్లర సమస్య కొట్లోచ్చినట్లు కనిపించింది. పర్యాటకులపై ఆదారుపడిన వ్యాపారాలు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. చిరు వ్యాపారస్తులు గిరాకీలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు.
 
సండే ఎక్కువగా కనిపించే చిల్లర సమస్య...
సెలవు రోజైన ఆదివారం పర్యాటకుల సంఖ్య బాగానే ఉన్నా...మండే టూ ఫ్రై డే సందర్శకుల సంఖ్య తగ్గుతోంది. సాధారణ రోజుల కన్నా..ఆదివారం చిల్లర సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పెద్ద నోట్లు ఏవీ చెల్లకపోవడం...కొత్తగా వచ్చిన రెండు వేల నోట్లకు చిల్లర అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులతో పాటు చిరువ్యాపారులకు చిల్లర సమస్య ఎక్కువైంది. ఈ ఆదివారం చార్మినార్ కట్టడాన్ని 5,168 మంది పర్యాటకులు సందర్శించగా...సాలార్‌జంగ్ మ్యూజియంను 4,700, చౌమహాల్లా ప్యాలెస్‌ను 1,192, జూ పార్కును 18232 మంది సందర్శించారు. వీరంతా చిల్లర సమస్యతో ఇబ్బందుకలు గురయ్యారు. సోమవారం సందర్శకుల సంఖ్య తగ్గడంతో చిల్లర కష్టాలు ఎక్కువగా కనిపించ లేదు.   

Advertisement
Advertisement