రాయలసీమపై నిర్లక్ష్యం తగదు | Rayalaseema, the neglect | Sakshi
Sakshi News home page

రాయలసీమపై నిర్లక్ష్యం తగదు

Mar 26 2015 12:28 AM | Updated on Sep 2 2017 11:22 PM

న్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్

జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి
 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం:  అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ గ్రేటర్ రాయలసీమలో హైకోర్టు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడ ఉండాలనేది ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదని, రాయలసీమ అభివృద్ధి జరగాలంటే రాజధాని లేదా హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు. నీటి పారుదల విషయంలో సీమ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కనీసం 5 శాతం కూడ కేటాయించకపోవటం బాధాకరమన్నారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హన్మంతరెడ్డి మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాల్లో  ఏ ఒక్కటి అమలు చేయటం లేదని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజధాని, హైకోర్టులు వేర్వేరు నగరాల్లో ఉన్నాయని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ ధ్యేయంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయలసీమ ఉద్యమ నేతలు పుత్త శివశంకర్, పోతుల శివ, మధుసూదన్ యాదవ్, రాధాకృష్ణారావు, ప్రొఫెసర్ ఎం.వెంకట్‌రెడ్డి, ఇస్మాయిల్‌రెడ్డి, బి.ప్రకాష్‌రెడ్డి, రామకృష్ణ, రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement