మే నుంచి విద్యుత్ చార్జీల పెంపు | power charges hike from may | Sakshi
Sakshi News home page

మే నుంచి విద్యుత్ చార్జీల పెంపు

Mar 10 2016 12:18 AM | Updated on Sep 5 2018 3:37 PM

మే నుంచి విద్యుత్ చార్జీల పెంపు - Sakshi

మే నుంచి విద్యుత్ చార్జీల పెంపు

రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఏప్రిల్లోప్రస్తుత చార్జీలే వసూలు చేస్తారు.

ఏప్రిల్‌లో ప్రస్తుత చార్జీలే అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్‌సీ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఏప్రిల్లోప్రస్తుత చార్జీలే వసూలు చేస్తారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలను ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీతో అమలు చేయడం ఆనవాయితీ. అయితే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2016-17 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)ను ఈఆర్‌సీకి గత నవంబర్‌కు బదులు మార్చి 8న సమర్పించాయి.

చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించడం, వాటిపై డిస్కంల వివరణ, అనంతరం బహిరంగ విచారణ జరిపి కొత్త టారిఫ్ ఖరారు చేసేందుకు సమయం లేకపోవడంతో చార్జీల పెంపు అమలును మేకు వాయిదా వేసినట్టు ఈఆర్‌సీ వర్గాలు తెలిపాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ తేదీలను ఈఆర్‌సీ ఖరారు చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న కరీంనగర్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటిదాకా విచారణ జరుగుతుంది. పెంపుపై చర్చించేందుకు ఈ నెల 17న ఈఆర్‌సీ ఆధ్వర్యంలో రాష్ట్ర సలహా కమిటీ సమావేశం జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement