రాజ్యాంగాన్ని కాల‘రాస్తారు!’

Constitution of India may some changes - Sakshi

రెండో మాట

రాజ్యాంగాన్ని బీజేపీ విధానాలకు అనుగుణంగా, తొల్లింటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మార్చే ప్రయత్నం వాజ్‌పేయి కాలంలోనే ఒకసారి జరిగిందన్న సంగతినీ విస్మరించలేం. సోలీ సొరాబ్జీ కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా ఉండగానే రాజ్యాంగంలోని ‘సెక్యులర్, సోషలిస్ట్‌’ పదాలను తొలగించాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పటికి పార్లమెంటులో బీజేపీకి ఇప్పుడున్నంత ‘మూక కొలువు’ లేనందున చొరవ చేయలేదు. కానీ నేడు అదుపు చేసుకోలేనంత మంది బలం (కాంగ్రెస్‌ తప్పిదాల ఫలితంగా) లోక్‌సభలో ఉంది.

‘రాజ్యాంగాన్ని మార్చడం కోసమే మేము (భారతీయ జనతా పార్టీ) అధికారంలోకి వచ్చాం. ఎందుకంటే, తాము సెక్యులరిస్టులమనీ, అభ్యుదయ వాదులమనీ ప్రగల్భించే వారికి తమ ఉనికినీ, వ్యక్తిత్వాన్నీ చాటుకునేటట్టు చేయగల తల్లిదండ్రులు గానీ, రక్త సంబంధం ఉన్నవాళ్లు గానీ ఉండరు. తల్లీ తండ్రీ ఉన్న రక్త సంబంధీకులకు మాత్రమే ఆత్మ గౌరవం ఉంటుంది!’
– కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే (కర్ణాటకలో 24–12–17న
జరిగిన సభలో అన్నమాట)
‘డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో సెక్యులర్‌ అనే పదాన్నే చేర్చలేదు.’
– సుబ్రహ్మణ్యంస్వామి (బీజేపీ నాయకుడు)
నరేంద్ర మోదీ శ్రీకృష్ణుని అవతారమే. 2019 లోక్‌సభ ఎన్నికలు అవగానే రాబోయే పదేళ్లకు పైగా మోదీయే దేశాన్ని ఏలుతారు. మాకు ఆవులంటే గౌరవం, ప్రేమ.’
– జ్ఞాన్‌దేవ్‌ అహూజా (రాజస్తాన్‌ బీజేపీ ఎమ్మెల్యే)

అశేష త్యాగాలతో భారతీయులు సాధించుకున్న రాజకీయ స్వాతంత్య్రాన్ని న్యూన పరచడం, అనేక అవాంతరాల మధ్య డాక్టర్‌ అంబేడ్కర్‌ రూపొం దించిన రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అధికార పగ్గాలు చేపట్టామని సాక్షాత్తు అధికార పార్టీ బాహాటంగా ప్రకటించడం రానున్న గడ్డురోజులకు సంకేతాలే. రహస్యంగా తీసుకునే నిర్ణయాలకు అధికార ముద్ర వేయించుకునేందుకు ముందుగా టుమ్రీలు వదలడం కమలనాథులకు కూసువిద్యే. ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని, దాని విస్పష్ట లక్ష్యం ప్రకటన (ప్రియాంబిల్‌)ను మార్చివేయడమే తమ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు ఉపన్యాసాలలో గతం నుంచి చెబుతున్నారు. ప్రకటనలు ఇస్తున్నారు. ఇది గణతంత్ర వ్యవస్థా సంకల్పానికి పూర్తి విరుద్ధం.

మూకబలంతో విజృంభణ
ఇప్పుడు లోక్‌సభలో బలాన్ని చూసుకుని మరింత తెగువతో ఆ పార్టీ సభ్యులు నిజరూపాలను ప్రదర్శిస్తున్నారు. ఏ సంశయం పీడిస్తున్నదో తెలియదు గానీ; ఈ ఉన్మాదపూరిత ప్రకటనలను ప్రధాని స్థాయిలో ఉన్న నరేంద్ర మోదీ గానీ, అధికార పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గానీ ఖండించకపోవడం మరీ విచిత్రం. మోదీతో సహా, ద్వితీయ తృతీయ స్థానాలలో ఉన్న అరుణ్‌ జైట్లీ వంటి నేతలు కూడా ఇలాంటి ప్రకటనలను అటు పార్లమెంటులోగానీ, ఇటు మరొక వేదిక మీద గానీ నిరాకరించే ప్రయత్నం చేయలేదు. అందుకే బీజేపీ రహస్య ఎజెండా నిజమేనని ప్రజలు భావించవలసిన పరిస్థితి ఏర్పడింది.

అసలు కాంగ్రెస్‌ పార్టీయే అంబేడ్కర్‌ను అవమానిస్తున్నదని కొందరు బీజేపీ నేతలు, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న నాయకుడు మోదీయేనని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. మరికొందరైతే, డాక్టర్‌ అంబేడ్కర్‌ అంటే తమకు ఎంతో గౌరవమని చెప్పుకుంటూనే అనంత్‌కుమార్‌ హెగ్డే ప్రకటనను ప్రతిపక్ష నేతలు వక్రీకరించారని అబద్ధం ఆడేశారు కూడా. మహా భారత యుద్ధకాండలో శకుని పాత్ర గురించి తెలిసినదే. ఇప్పుడు అభినవ శకుని పాత్రను నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంస్వామి రాజ్యాంగంలో సెక్యులర్‌ అనే పదాన్ని అంబేడ్కర్‌ ప్రయోగించలేదని కోతకోశారు.

దీనికేమంటారు?
కానీ, ఒకసారి విఖ్యాత భారతీయాంగ్ల రచయిత ముల్క్‌రాజ్‌ ఆనంద్, డాక్టర్‌ అంబేడ్కర్‌ మధ్య జరిగిన చర్చలో (కఫే పరేడ్, కొలాబా బొంబాయి, మే, 1950) రాజ్యాంగం గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడే, ‘రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యునిగా వ్యక్తి స్వేచ్ఛ హక్కు గురించి మీరు పట్టుదలతో వాదించగలరా? పౌరుడి ప్రాథమిక హక్కులను మీ కమిటీ గుర్తించింది, వ్యక్తి స్వేచ్ఛ హక్కును గుర్తించింది. కానీ మీరు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా ఆమోదించారు గదా! ఈ ఆస్తిహక్కు అనేది– సంపదను వారçసత్వంగా అనుభవించే వారు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోరా మరి! అలాంటప్పుడు పేదలు, దళితులు, అస్పృశ్యులు నిరంతరం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసిందే కదా!’ అని ముల్క్‌రాజ్‌ అడిగారు. దీనికి స్పందిస్తూ అంబేడ్కర్, ‘అందుకే కదా, రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్, ప్రజాస్వామ్య వ్యవస్థను ఆదర్శంగా ముందుకు నెట్టవలసి వచ్చింది’ అని అన్నారు. అప్పుడే మరొక అంశాన్ని కూడా అంబేడ్కర్‌ స్పష్టం చేశారు– ‘ప్రభుత్వ కాల్దారీ హక్కుల ప్రకారం భూమిని దున్నుకుని బతికే హక్కు ప్రతివారికి దక్కే పక్షంలో సమానత్వం సాధ్యమవుతుంది. అప్పుడు దోపిడీకి అవకాశం ఉండదు. ఇప్పటివరకు అస్పృశ్యులైన దళితులకు, చివరికి హిందువులలోని, ముస్లింలలోని పెక్కు వర్గాలకు కౌలు హక్కులు లేవు.

కనుక భూమి లేని రైతులు ఉత్తి చేతులతోనే మిగిలిపోయారు’. ఇందుకు ముల్క్‌రాజ్‌ ప్రత్యుత్తరం ఇది– ‘అయినప్పుడు పని చేసుకు బతికే హక్కును రాజ్యాం గంలో పౌరుని ప్రాథమిక హక్కుగా గుర్తించి ఉండాల్సింది గదా!’ అంబేడ్కర్‌ ఈ మాటకు స్పందిస్తూ, ‘ముసాయిదా రచనా సంఘం సభ్యులలో నేను ఒక డిని మాత్రమే గదా!’ అన్నారు. అప్పుడు ముల్క్‌రాజ్, ‘అయితే సింహం ముందు గొర్రెపిల్లయిపోయారా!’ అని ప్రశ్నించారు. దానికి అంబేడ్కర్‌ ‘అప్పటికీ నేను చేయగలిగినంత చేశాను. రాయితీలు గుంజగలిగాను. నేనిప్పుడు గర్జిస్తున్నాను’ అన్నారు. యువతరాలు పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, అప్పుడు ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారని కూడా ఆయన చెప్పారు. ఆఖరిమాటగా ముల్క్‌రాజ్, ‘కానీ, 1789 విప్లవం లాగా పెను తిరుగుబాటు రాకుండా మీరనుకుంటున్న పరివర్తన సాధ్యపడకపోవచ్చు’ అన్నారు. దీని మీదే అంబేడ్కర్‌ ఒక చెణుకు విసిరారు, ‘ఆనంద్‌గారూ! ఈ మాట (విప్లవం) మీ నోటి నుంచి వినడం ఆశ్చ ర్యంగా ఉంది! మీ నవలలో గాంధీజీని అస్పృశ్యుల (దళితుల) విమోచన ప్రదాతగా చిత్రించి మీరు అహింసావాదిగా మారిపోయారు కదా!’ అని.

కాషాయీకరణ దిశగా..
అంబేడ్కర్, ముల్క్‌రాజ్‌ల విషయం అలా ఉంచితే, రాజ్యాంగాన్ని బీజేపీ విధానాలకు అనుగుణంగా, తొల్లింటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మార్చే ప్రయత్నం వాజ్‌పేయి కాలంలోనే ఒకసారి జరిగిందన్న సంగతినీ విస్మరించలేం. సోలీ సొరాబ్జీ కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా ఉండగానే రాజ్యాంగంలోని ‘సెక్యులర్, సోషలిస్ట్‌’ పదాలను తొలగించాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పటికి పార్లమెంటులో బీజేపీకి ఇప్పుడున్నంత ‘మూక కొలువు’ (బ్రూట్‌ మెజారిటీ) లేనందున చొరవ చేయలేదు. కానీ నేడు అదుపు చేసుకోలేనంత మంది బలం (కాంగ్రెస్‌ తప్పిదాల ఫలితంగా) లోక్‌సభలో ఉంది. కాబట్టి ‘రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికే బీజేపీ అధికారంలోకి వచ్చింద’ని కొందరు ఎంపీలు, మంత్రులు ప్రకటించగలుగుతున్నారు.

వక్రీకరణల రాజ్యం
ఈ ప్రకటనలు బాహాటంగా వెలువడకముందే పౌరుల వాక్, సభా స్వాతంత్య్రాలకు, అభిప్రాయ వ్యక్తీకరణకు, న్యాయ వ్యవస్థ భాష్య స్వేచ్ఛకు, సమావేశ స్వేచ్ఛకు, సెమినార్‌లు, చలనచిత్ర నిర్మాణాలపైన, కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ఎన్నికలు, విద్వద్గోష్టుల స్వేచ్ఛపైన– గత మూడేళ్లుగా పాలక ‘డేగకళ్లు’ పహారా కాస్తూనే ఉన్నాయి. ఆ యజ్ఞంలో ప్రజా విశ్వాసం చూరగొన్న హేతువాద శక్తులను, వారి నాయకులను రహస్యంగా హతమారుస్తూ వారి హత్యాకాండ జరిగిన చోట హంతకుల్ని వెతికి పట్టుకోకుండా మరెక్కడో వెతికి, ‘ఎవరూ దొరక్కపోతే పాత కేడీనే పట్టుకురమ్మన్న’ పోలీసు కేసుల్లాగా విచారణ తంతులు ముగిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలకు, అది రూపొందించిన కొన్ని చట్టాలకు కూడా విరుద్ధంగానూ, ప్రభుత్వమూ, పౌరులూ విధిగా పాటించాలని నిర్దేశిస్తున్న ‘బాధ్యతల అధ్యాయాన్ని’ పాలకులు అటకెక్కించారు. చివరికి ‘శాస్త్రీయ దృక్పథాన్ని పౌరులలో పెంచి’, మూఢ విశ్వాసాల నుంచి దూరం చేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్న లిఖితపూర్వక ఆదేశాన్ని బీజేపీ పాలకులు మరింతగా చిత్తు కాగితం స్థాయికి దిగజారుస్తున్నారు.

కేంద్ర, విద్యా, సాంస్కృతిక, శాస్త్ర, చారి త్రక పరిశోధనా సంస్థలన్నిటిలోనూ ఆధునిక పరిశోధనల స్థానంలో ‘ధాతనామ సంవత్సరం’ నాటి ఆలోచనలతో ‘పరిశోధన’లు జరిపే ప్రక్రియకు అంకురార్పణలు చేస్తున్నారు. నిజానికి వీటన్నిటికీ కాంగ్రెస్‌ హయాంలోనే తూట్లు పడినాయి.  యజ్ఞ, యాగ, యోగాదులన్నింటినీ ‘నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వం’ లాగా, మానసిక, శారీరక, విజ్ఞానశాస్త్ర వ్యాయామ కళలను పెంపొందించకుండా ప్రస్తుత నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆధునిక శస్త్ర చికిత్సలకు ప్రాధాన్యమివ్వవలసిన చోట వినాయకుడికి జరిగిన ‘సర్జరీయే’ నేడు మనం చూస్తున్న తొండం అమరిక అని చెప్పే పాలకులున్న చోట వైజ్ఞానిక దృష్టి వర్ధిల్లదు. చరిత్ర పాఠాలు కూలంకషంగా మార్చి, వాస్తవ ఘటనలను మభ్యపెట్టే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మతాతీత లౌకిక వ్యవస్థకు, సర్వమత, సర్వ ధర్మ సమన్వయ భారతీయ వ్యవస్థకు భిన్నంగా– ముక్కూ ముఖం లేని ‘హిందూత్వ’ నిర్వచనంలో సుందర భారతాన్ని ఇమడ్చడం సంకుచిత రాజకీయం.

ఆ వాస్తవాన్ని గుర్తించాలి
మనది ‘సింధు’ నాగరికత. రాజ్య విస్తరణ కోసం పర్షియన్లు (పారశీకులు) సింధులోయలో ప్రవేశించినప్పుడు వారికి ‘హ’కారం తప్ప ‘స’కారం పలకదు కాబట్టి, ‘సింధు’ను ‘హిందు’గా మార్చుకున్నారు. ఈ సత్యాన్ని మహా పండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఎనభై ఏళ్ల క్రితమే చెప్పారు. ఆమాటకొస్తే కంచి కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య ‘జగద్గురు బోధలు’ గ్రంథంలో ‘హిందూ’ పుట్టు పూర్వోత్తరాలను వివరిస్తూ చెప్పిన మాటలు వినండి: ‘మన మతాన్ని హిందూ మతం అనడం సరికాదు. సింధు నదీతీరంలో ఉన్నవారి మతానికి పాశ్చాత్యులు పెట్టిన పేరు హిందూమతం. అందుచే మన మతానికి చారిత్రకంగా ఒక ప్రవక్తో, మూల గురువో లేడు’ (‘వేదవ్యాసులు; ఆదిశంకరులు; జగద్గురు బోధలు’: పరిశోధకులు శతావధాని వేలూరి శివరామశాస్త్రి: 1967, పే. 101). కాగా, ఇప్పుడు రాజ కీయ లబ్ధి కోసం అయితే ‘సింధుమతం’ అని రావాలిగానీ దాని అపభ్రంశమైన ‘హిందు మతం’గా రాకూడదు. చివరికది ఆరెస్సెస్‌–బీజేపీ ప్రయోజ నాల కోసం ‘హిందూత్వ’గా మారి భారత ప్రజల సమైక్య ఉమ్మడి వారసత్వ మనుగడకు ప్రమాదకర నినాదంగా మారడం బాధాకరం!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top