శరణ్య మార్క్
మాస్క్లోంచి బన్నీ టీత్ కనిపించేలా నవ్వుతున్న ఈ అమ్మాయి పేరు శరణ్య. కేరళలోని అలప్పుళ ఆమె సొంతూరు. పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె అభిరుచి పెయింటింగ్. ఊహ తెలిసినప్పటి నుంచీ పెయింటింగ్ వేస్తోంది. ఇప్పుడు కరోనా లాక్డౌన్లోనూ ప్రయోగాలు చేస్తోంది. మాస్కుల మీద. కరోనా కష్టం ఎవరినీ గడపదాటనివ్వట్లేదు. అత్యవసరమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చిన నోటికి మాస్కులు, కళ్లల్లో భయం, మనసులో దిగులుతోనే కదలాల్సి వస్తోంది. ఆ పరిస్థితి నచ్చలేదు ఆ అమ్మాయికి. అన్నట్టు శరణ్య వాళ్లమ్మ మాస్కులు కుట్టి పంచుతున్నారు. ఒకరోజు అలా కుట్టిన కొన్ని మాస్కుల మీద ‘స్మైలీ’ని పెయింట్ చేసింది. బన్నీ టీత్తో సహా. అందులోంచి ఒక మాస్క్ను తను ధరించి బయటకు వెళ్లింది. చూసిన వాళ్ల కళ్లల్లో నవ్వు మెరిసింది. వాళ్లు వెనక్కి తిరిగి మరీ తనను చూడ్డమూ గమనించింది. వర్కవుట్ అవుతోంది అయితే.. అని ఇంటికి వెళ్లి మరిన్ని మాస్కుల మీద స్మైలీలను పెయింట్ చేయడం మొదలుపెట్టింది. అలా శరణ్య మార్క్ మాస్కులకు భలే డిమాండ్ ఏర్పడిందట ఇప్పుడు. దాంతో శరణ్య, వాళ్ల చెల్లి గౌరి ఇద్దరూ కలిసి వాళ్లమ్మ కుట్టే మాస్కుల మీద స్మైలీ బొమ్మలు వేసే పనిలో బిజీ అయిపోయారట.
శరణ్య పెయింటింగ్ వర్క్స్
సంబంధిత వార్తలు