
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ34
మరో రికార్డు ఖాతాలో వేసుకోవడానికి ఇస్రో సిద్ధమైంది. వివిధ దేశాలకు చెందిన 20 ఉపగ్రహాలతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ34 రాకెట్ నింగిలోకి పంపనున్నారు.
► ఉదయం గం. 9.25కి ప్రయోగం ప్రారంభం
► 20 నిమిషాల 30 సెకన్లలో కక్ష్యలోకి..
► 20 ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న రాకెట్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): మరో రికార్డు ఖాతాలో వేసుకోవడానికి ఇస్రో సిద్ధమైంది. వివిధ దేశాలకు చెందిన 20 ఉపగ్రహాలతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ34 రాకెట్ నింగిలోకి పంపనున్నారు. 20 నిమిషాల 30 సెకన్లలోనే పూర్తయే ఈ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. 48 గంటల కౌంట్డౌన్ పూర్తయిన అనంతరం పీఎస్ఎల్వీ సీ34 నింగిలోకి దూసుకుపోనుంది. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ34 రాకెట్ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశలలో ప్రయోగించనున్నారు. 727.5 కిలోల కార్టోశాట్ 2 సిరీస్తో పాటు 560 కిలోల బరువైన మరో 19 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ34 మోసుకుపోనుంది. ఈ ప్రయోగంలో భారత్కు చెందిన ఉపగ్రహాలతో పాటు అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేసియా ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం ఈ ఉపగ్రహాల బరువు 1288 కిలోలు.
ప్రయోగం ఇలా...
► నాలుగోదశల్లో రాకెట్ జ్వలనను పూర్తి చేస్తారు.
► తర్వాత 20 ఉపగ్రహాలను ఒకదాని తరువాత ఒక్కోటిగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
► ముందుగా ఇస్రో శాటిలైట్ కార్టోశాట్-2సిరీస్ను 17.7 నిమిషాలకు భూమికి 505 కిలోమీటర్లు ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెడతారు.
► 17.42 నిమిషాలకు సత్యభామశాట్, స్వయంశాట్లను,
► 18.22 నిమిషాలకు ఇండోనేసియాకు చెందిన లపాన్-ఏ3, జర్మనీకి చెందిన బిరోస్ ఉపగ్రహాలను,
► 19 నిమిషాలకు కెనడాకు చెందిన ఎం3ఎంశాట్, గూగుల్ సంస్థకు చెందిన స్కైశాట్జెన్ ఉపగ్రహాలను,
► 19.20 నిమిషాలకు కెనడాకు చెందిన జీహెచ్బీశాట్,
► 20.20 నిమిషాలకు యూఎస్ఏకు చెందిన మొదటి డౌవ్ శాటిలైట్,
► 20.30 నిమిషాలకు 12 డౌవ్ శాటిలైట్స్ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
► అయితే భవిష్యత్ ప్రయోగాల పరీక్షలకు మరో 14 నిమిషాలు అదనం..
► మొత్తం 35 నిమిషాలకు ప్రయోగం సంపూర్ణం.
శ్రీవారి ఆలయంలో డెరైక్టర్ల పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత మంగళవారం పీఎస్ఎల్వీ సీ-34 నమూనాకు పూజలు నిర్వహించారు. బుధవారం ప్రయోగం నేపథ్యంలో ఇస్రో డెరైక్టర్లు ఏ.జయరామన్, ఎస్.అరుణన్, కె.కనుంగో, ఎంఎస్.అనురూప్ మంగళవారం ఉదయం గర్భాలయ మూలమూర్తి పాదాల చెంత రాకెట్ నమూనాతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. షార్ నుంచి నిర్వహించే ప్రయోగాలకు ముందు తిరుమలేశుని ఆలయంలో పూజలు నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది.