బ్యాంకు మేనేజర్‌పై చీటింగ్‌ కేసు | police filed case on bank manager | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్‌పై చీటింగ్‌ కేసు

Jul 1 2017 9:26 AM | Updated on Sep 5 2017 2:57 PM

నకిలీ డాక్టర్లతో కర్నూలు, ఆదోనిలో ఆసుపత్రులు నిర్వహిస్తున్న నాగేంద్రప్రసాద్‌తో పాటు కర్నూలు కిడ్స్‌ వరల్డ్‌ పక్కనున్న కెనరా బ్యాంక్‌ మేనేజర్‌పై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదయ్యింది.

కర్నూలు : నకిలీ డాక్టర్లతో కర్నూలు, ఆదోనిలో ఆసుపత్రులు నిర్వహిస్తున్న నాగేంద్రప్రసాద్‌తో పాటు కర్నూలు కిడ్స్‌ వరల్డ్‌ పక్కనున్న కెనరా బ్యాంక్‌ మేనేజర్‌పై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదయ్యింది. నాగేంద్ర ప్రసాద్‌ బీటెక్‌ చదువుకున్నాడు. ఆయన భార్య వాణికుమారి ఇంటర్మీడియట్‌ చదువుకుంది. అయితే కర్నూలు, ఆదోనిలో ఆసుపత్రుల నిర్వహణకు రెడ్డిపోగు విజయభాస్కర్‌ సహాయం కోరాడు. ఆసుపత్రి నిర్వహణలో భాగస్వామిగా ఉంటే నెలకు రూ.లక్షన్నర జీతం ఇస్తానంటూ  ఒప్పందం కుదుర్చుకున్నాడు. నకిలీ వైద్యులతో ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ నెల 20వ తేదీన అధికారులు దాడులు నిర్వహించి ఆదోని, కర్నూలులో ఉన్న ఆసుపత్రులను సీజ్‌ చేశారు.

దర్యాప్తులో నాగేంద్ర ప్రసాద్‌ మోసాలు మరిన్ని బయటపడ్డాయి. డాక్టర్‌ రెడ్డిపోగు విజయభాస్కర్‌ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి కర్నూలు కిడ్స్‌ వరల్డ్‌ పక్కనున్న కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టి కోటిన్నర రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ విషయం విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడటంతో డాక్టర్‌ విజయభాస్కర్‌ను విజిలెన్స్‌ అధికారులు విచారించారు. రుణంతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తాను చదువుకున్న సర్టిఫికెట్లను నకిలీ చేసి ఫోర్జరీ సంతకాలతో నాగేంద్రప్రసాద్, ఆయన భార్య వాణి కుమార్‌ రుణం తీసుకుని మోసం చేశారంటూ శనివారం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నాగేంద్రప్రసాద్‌తో పాటు ఆయన భార్య వాణికుమారి, బావమరిది రమేష్, అప్పటి బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్, మేనేజర్లపై చీటింగ్‌ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ డేగల ప్రభాకర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement