అప్పుడే..గుర్తుకొస్తాయి.. | medaram toilets only fair time use only | Sakshi
Sakshi News home page

అప్పుడే..గుర్తుకొస్తాయి..

Sep 5 2017 10:04 AM | Updated on Oct 9 2018 5:58 PM

అప్పుడే..గుర్తుకొస్తాయి.. - Sakshi

అప్పుడే..గుర్తుకొస్తాయి..

మేడారంలో 2016 జాతరలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో 40 మరుగుదొడ్లు, ఐటీడీఏ క్యాంప్‌ ఆఫీసు ఆవరణలో 20 మరుగుదొడ్లు నిర్మించారు.

జాతర నాలుగు రోజులే వినియోగం
ఆ తర్వాత నిరుపయోగమేనా?
శాశ్వత మరుగుదొడ్లు అధ్వానం
భక్తులకు వినియోగంలోకి రాని వైనం
నిరుపయోగంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌
పట్టించుకోని అధికారులు


మేడారంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు జాతర జరిగే నాలుగు రోజులు మాత్రమే గుర్తుకొస్తాయి. 2016 జాతరలో మల విసర్జన కోసం శాశ్వత మరుగుదొడ్లు నిర్మించారు. అవి ఆ జాతర జరిగే నాలుగు రోజులు మాత్రమే వినియోగంలోకి రాగా జాతర ముగిసిన అనంతరం నిరుపయోగంగా మారాయి. మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి నిరంతరం భక్తులకు వినియోగంలోకి తీసుకురావాలని లక్షల నిధులు వెచ్చించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి.

ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు):
మేడారంలో  2016 జాతరలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో  రూ.60 లక్షలతో 40 మరుగుదొడ్లు, ఐటీడీఏ క్యాంప్‌ ఆఫీసు ఆవరణలో 20 మరుగుదొడ్లు నిర్మించారు. ఆ జాతరలో నాలుగు రోజులు వినియోగంలోకి వచ్చిన టాయిలెట్లు జాతర తర్వాత నిరుపయోగంగా మారడంతోపాటు తలుపులు ఊడిపోవడంతోపాటు బేష న్లు పగిలిపోయాయి. జాతర తర్వాత కూడా వచ్చే భక్తులకు వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్ధేశ్యంతో నిర్మించిన మరుగుదొడ్లకు మెయింటనెన్స్‌ చర్యలు తీసుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి.  మేడారాన్ని పారిశుద్ధ్య మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే  అధికారుల లక్ష్యం నిర్లక్ష్యంగా నీరుగారిపోతోంది.

మరుగుదొడ్లు నిర్మించి రెండేళ్లు గడవక ముందే అధ్వానంగా మారడంతో భక్తులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఈ మరుగుదొడ్లకు మరమ్మతు చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది.  జాతర నాలుగు రోజులే కాదా..? అన్నట్లు అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారే తప్పా. తర్వాత పట్టించుకున్న నాథులే లేరు.

రూ.40లక్షలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు..
మేడారంలో నిర్మించిన చేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ గదులు కూడా నిరుపయోగంగా ఉన్నాయి.  2016 జాతరలో స్థానిక గిరిజనుల వ్యాపారాల షాపుల ఏర్పాటు కోసం రూ. 40 లక్షలతో 27 షాపింగ్‌ కాంప్లెక్స్‌ గదులు నిర్మించి జాతరలో వ్యాపారాలకు కేటాయించిన అధికారులు జాతర అనంతరం  స్థానికంగా ఉండే వ్యాపారులకు కేటాయించలేదు. దీంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి.  కానీ వ్యాపారులు మాత్రం రోడ్ల పక్కన గుడిసెలు వేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

వాటిని ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారోననే ప్రశ్న గిరిజన వ్యాపారుల్లో తలెత్తుతోంది. అధికారుల నిర్లక్ష్యంతోనే వినియోగంలోకి తీసుకురాలేదని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ గదులను పరిశీలిస్తే మేడారంలో భక్తుల కోసం నిర్మించిన శాశ్వత నిర్మాణాలు ఏమేరకు అధికారులు వినియోగంలోకి తీసుకువస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికైన జిల్లా కలెక్టర్‌ స్పందించి వీటిని భక్తులకు వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఎంతైన ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement