ఎస్ఎఫ్ఎస్ సభ్యులు
విద్యార్థి దశలో స్నేహితులుగా మారిన ఆ యువకులు సేవల బాటలో పయనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నరసన్నపేట : విద్యార్థి దశలో స్నేహితులుగా మారిన ఆ యువకులు సేవల బాటలో పయనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్టూడెంట్స్ ఫర్ సొసైటీ (ఎస్ఎఫ్ఎస్)ని స్థాపించి పట్టణంలోనే కాకుండా పరసర గ్రామాలకు చెందిన పేద కుటుంబాలకు సాయం చేస్తున్నారు. నరసన్నపేటకు చెందిన ముద్దాడ కృష్ణ తేజ, నక్క ప్రవీన్కుమార్, శాంతి మోహన్లు మంచి స్నేహితులు. వీరి ముగ్గురికీ వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఎస్ఎఫ్ఎస్. అంతకు ముందు తమ వద్ద ఉన్న పాకెట్ మనీతో కనిపించే బీదవారికి సహాయం చేసేవారు. తర్వాత సంస్థను ఏర్పాటు చేసి సేవల పరిధిని పెంచారు. వీరికి ఎన్.వంశీతో పాటు మరో 10 మంది జత కలిశారు. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ ఈసంస్థ ప్రస్తుతం నరసన్నపేటలో ప్రతి విద్యార్థికి, యువతకు సుపరిచితం.
సేవా కార్యక్రమాలు..
ప్రస్తుతం దీంట్లో 15 మంది సభ్యులు ఉండగా వీరందరూ పాకెట్ మనీ లోంచి కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రమాదాల్లో ఆస్తులు కోల్పోయిన వారికి కూడా సాయపడుతున్నారు. రక్తదానం, మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ స్నేహానికి కొత్త అర్థం చెబుతున్నారు.